చికాగో అమరుల స్ఫూర్తితో పోరాడాలి: రమేశ్
న్యూస్తెలుగు/వనపర్తి : అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని దినం, పనికి తగ్గ వేతనం కోసం పోరాడి అమరులైన కార్మికుల స్ఫూర్తితో కేంద్రం తెచ్చిన లేబర్ కోడుల రద్దు కై పోరాడాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ పిలుపునిచ్చారు. మేడే వారోత్సవాల్లో భాగంగా గోపాల్పేట మండలం ఏదుట్ల లో సిపిఐ అరుణ పతాకాన్ని గ్రామ శాఖ కార్యదర్శి కురుమూర్తి ఆవిష్కరించారు. మాట్లాడుతూ.. దేశంలో కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రం ఒక్క కలం పోటుతో 4 లేబర్ కోడలుగా మార్చిందన్నారు. 4 కోడులు కార్మికుల పాలిట ఉరితాళ్లుగా మారా యన్నారు. లేబర్ కోడుల వల్ల కార్మి కులు సంఘం పెట్టుకునే హక్కు ,సమ్మె చేసే హక్కు, పనికి తగ్గ జీతం అడిగే హక్కు, 8 గంటల పని దినం లేకుండా పోయిందన్నారు. 139 ఏళ్ల క్రితం చికాగో అమరుల పోరాటం ఫలితంగా సాధించిన 8గంటల పని దినాన్ని నరేంద్ర మోడీ 12 గంటలకు పెంచారన్నారు. కార్మికుల శ్రమను సంపన్నులకు దోచి పెట్టేందుకు నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతోందని కార్మిక లోకం పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్మిక కర్షక యువత మహిళ విద్య ఉద్యోగ వర్గాల హక్కుల సాధనకు సిపిఐ లో చేరాలన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు జె.చంద్రయ్య, గోపాలకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమయ్య, స్థానిక నాయకులు కురుమూర్తి,కరీం, తాహెర్ తదితరులు పాల్గొన్నారు. (Story:చికాగో అమరుల స్ఫూర్తితో పోరాడాలి: రమేశ్)

