వినుకొండలో ప్రగతి పరుగులు.. ఐదేళ్లలో రూ.313 కోట్లతో అభివృద్ధి!..
మౌలిక వసతులు, మంచినీటి ప్రాజెక్టులకు పెద్దపీట
పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
స్వచ్ఛ సర్వేక్షణ్-2025లో జాతీయ స్థాయిలో మెరిసిన వినుకొండ
న్యూస్ తెలుగు/వినుకొండ : వినకొండ మునిసిపల్ పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగిసిన నేపథ్యంలో వీడ్కోలు సభ జరిగింది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన ఈ వీడ్కోలు సభలో. 2021. 2026. పురపాలక సంఘం కాలంలో జరిగిన అభివృద్ధిపై. చైర్మన్ డాక్టర్ దస్తగిరి. మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్. నివేదిక వివరించారు. వినుకొండ పురపాలక సంఘం పరిధిలో గత ఐదేళ్ల కాలంలో (2021-2026) మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరిగాయాన్నారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేశారని, గడచిన ఐదేళ్లలో పట్టణంలో ఏకంగా రూ.313.37 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి పట్టణ రూపురేఖలను మారాయన్నారు.
ఇంటింటికీ మంచినీరు.. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం…
పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు పాలకవర్గం విశేష కృషి చేసింది. మంచినీటి సరఫరా కోసం ‘అమృత్ 2.0’ పథకం కింద రూ.29.54 కోట్లు మంజూరు కాగా, పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అలాగే, ‘యు.ఐ.డి.యఫ్’ పథకం ద్వారా రూ.210 కోట్లతో మంచినీటి చెరువును అభివృద్ధి చేసి, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చే పనులకు టెండర్లు పిలిచారు. పారిశుద్ధ్య మెరుగుదలలో భాగంగా స్వచ్ఛ భారత్ (ఎస్.బి.ఎం 2.0) కింద రూ.22.18 కోట్లతో రెండు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (STP) నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు.
రహదారులు, కాలువల నిర్మాణానికి నిధుల వరద….
పట్టణమంతటా అంతర్గత రహదారుల నిర్మాణానికి వివిధ పథకాల కింద నిధులు వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.23.25 కోట్లు, పురపాలక సంఘ సాధారణ నిధులు రూ.15 కోట్లు, బి.పి.యస్ & యల్.ఆర్.యస్ నిధులు రూ.3.50 కోట్లు, ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ.1.50 కోట్లు, ‘గడప-గడపకు మన ప్రభుత్వం’ కింద రూ.80 లక్షలు, వుడా నిధులు రూ.40 లక్షలు.. ఇలా ప్రతి పైసాను సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, వీధి దీపాల ఏర్పాటుకు ఖర్చు చేశారు.
ప్రజా వైద్యం.. అన్నదానం…
పేద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నేషనల్ హెల్త్ మిషన్ (యు.పి.హెచ్.సి) కింద రూ.కోటి నిధులతో రెండు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే, పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలన్న సదుద్దేశంతో రూ.15 లక్షలతో అన్న క్యాంటీన్కు మరమ్మతులు చేసి కేవలం రూ.5 లకే భోజనం అందిస్తున్నారు. విద్యార్థుల వసతి కోసం రూ.కోటి నిధులతో డిగ్రీ కళాశాల వద్ద కాంపౌండ్ వాల్ నిర్మించారు.
ఆదాయ వనరుల పెంపు…
పురపాలక సంఘానికి స్థిరమైన ఆదాయం సమకూర్చే దిశగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద అసంపూర్తిగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ను రూ.1.54 కోట్లతో పూర్తి చేశారు. 25 షాపులను వేలం వేయడం ద్వారా మున్సిపాలిటీకి ఏటా రూ.16 లక్షల ఆదాయం వస్తోంది. పట్టణంలోని 22.45 ఎకరాల ఎస్.ఎస్.పి గ్రౌండ్లో షాపింగ్ కాంప్లెక్స్, పార్కు, ఇండోర్/అవుట్ డోర్ స్టేడియం, లైబ్రరీ తదితర భారీ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది పూర్తయితే మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం రానుంది.
అవార్డుల పంట.. ఆదర్శంగా వినుకొండ….
ఆస్తుల నిర్వహణ, పన్నుల వసూళ్లలో వినుకొండ రికార్డు సృష్టించింది. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, కుళాయి చార్జీల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. అలాగే ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025’ ర్యాంకింగ్లో ప్రజారోగ్య విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో 9వ స్థానం, జాతీయ స్థాయిలో 300వ స్థానాన్ని కైవసం చేసుకుని వినుకొండ పురపాలక సంఘం ఆదర్శంగా నిలిచిందన్నారు(Story : వినుకొండలో ప్రగతి పరుగులు.. ఐదేళ్లలో రూ.313 కోట్లతో అభివృద్ధి!.. )
