శావల్యాపురం పాఠశాలలో చీఫ్ విప్ జీవీ ఆకస్మిక తనిఖీ…
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మంగళవారం శావల్యాపురం గ్రామంలోని జడ్పీహెచ్ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి, విద్యా వాతావరణంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. భోజనం నాణ్యతపై వివరాలు తెలుసుకుని, విద్యార్థుల మధ్య కూర్చుని స్వయంగా భోజనం చేసి రుచి, నాణ్యతను పరీక్షించడం విశేషంగా నిలిచింది. అనంతరం పాఠశాల స్టోర్రూమ్ను సందర్శించి బియ్యం, నిత్యావసర సరుకుల నిల్వలను తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రతను పరిశీలిస్తూ, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఇక జీవి ఆంజనేయులుకి విద్యారంగంపై ప్రత్యేక ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థులతో స్నేహపూర్వకంగా ముచ్చటిస్తూ, బాగా చదువుకుని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు. వారి లక్ష్యాలు, అభిరుచుల గురించి అడిగి తెలుసుకున్నారు.మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులు, ఉపాధ్యాయులకు ఆదేశించారు. పిలవని అతిధుల తమ పాఠశాలకు వచ్చి తమకు భోజనం వడ్డించడమే కాక, తమతో కలిసి భోజనం చేసి తమ బాగోగులు గురించి మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : శావల్యాపురం పాఠశాలలో చీఫ్ విప్ జీవీ ఆకస్మిక తనిఖీ… )
