వినుకొండలో ఘనంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
న్యూస్ తెలుగు/ వినుకొండ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కార్యాలయంలో శుక్రవారం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్” రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పిలుపు మేరకు నియోజవర్గంలోని యువత భారీగా శిబిరానికి తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన 43 కేజీల భారీ కేకును టిడిపి నాయకులు కట్ చేసి యువ నేత లోకేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చీఫ్ విప్ జీవి సూచన మేరకు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. వినుకొండ మండలం విఠం రాజు పల్లి గ్రామంలో బధిరుల పాఠశాల నందు విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లెజెండరీ రక్తదాన శిబిరానికి నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువ కెరటం నారా లోకేష్ బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. యువ గళం పాదయాత్రతో టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించారన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొట్టమొదటి నాయకుడు నారా లోకేష్ బాబు అని కొనియాడారు. యువ గళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న యువ నాయకుడు లోకేష్ మరిన్ని పదవులు చేపట్టి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:వినుకొండలో ఘనంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు)

