మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
వినుకొండలో ఈనెల 22న మెగా జాబ్ మేళా
జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన జీవి
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన వినుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో మెగా జాబ్ మేళా జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను చీఫ్ విప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నారని వివరించారు. 22వ తేదీన జరిగే మెగా జాబ్ మేళాకు టెక్ మహీంద్రా, షణ్ముఖ, టాటా, ఎస్ బి ఐ, యాక్సిస్, కియా లాంటి ప్రముఖ కంపెనీలు 30కి పైగా వస్తున్నాయని తెలిపారు. వినుకొండ నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జాబ్ మేళా ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు సోషల్ మీడియా ద్వారా లింకు పంపడం జరుగుతుందని ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది మెగా జాబ్ మేళా సమాచారాన్ని ఇంటింటికి తీసుకువెళ్లాలని, టిడిపి,జనసేన, బిజెపి కూటమి నాయకులు సైతం జాబ్ మేళా సమాచారాన్ని ప్రజలకు తెలియపరచాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వినుకొండ లో జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, ఇప్పటికీ 5000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న జాబ్ మేళా అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.(Story : మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి )
