ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఆత్రుతగా ఎదురుచూసే క్రిస్మస్ పండుగ వేడుకలకు నాంది పలుకుతూ, మంగళవారం తో క్రిస్మస్ నెల ప్రారంభమైంది. ప్రతి ఏడాది డిసెంబర్ 25వ తేదీన జరుపుకునే యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా విశ్వాసులు సాంతా క్లాజ్లు, రంగురంగుల లైట్లు, ముద్దైన నక్షత్రాలతో తమ ఇళ్లను అలంకరించుకుంటారు. మంగళవారం తో ప్రారంభమైన క్రిస్మస్ నెల మొత్తం ఆనందం, భక్తి, సేవా కార్యక్రమాలతో నిండిపోతుంది. ప్రతి గ్రామంలో,పట్టణంలో చర్చిల ప్రాంగణాలు ప్రత్యేకంగా వెలిగిపోనున్నాయి. పిల్లలు క్రిస్మస్ కీర్తనలు పాడుతూ, పెద్దలు ప్రార్థనల్లో పాల్గొంటూ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇళ్ల ముందర క్రీస్తు పుట్టుకకు గుర్తుగా నక్షత్రాలను అమర్చి వెలిగించడం, రంగురంగుల లైట్లతో అలంకరించడం ఈ నెల ముఖ్య సంప్రదాయాలలో ఒకటి. డిసెంబర్ 24 రాత్రి జరిగే మిడ్నైట్ ఆరాధనతో ఉత్సాహం తారాస్థాయికి చేరుకోగా, డిసెంబర్ 25 తెల్లవారు జామున జరిగే ప్రత్యేక ఆరాధనతో పండుగ కార్యక్రమాలు చేరుకుంటాయి. ప్రేమ, శాంతి, క్షమ, సేవ భావాలకి ప్రతీకగా నిలిచే క్రిస్మస్ పండుగకు ముందస్తు ఏర్పాట్లతో ఇప్పటికే విశ్వాసుల ఇళ్లు పండుగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి.(Story : ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు )
