ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలో రైతులు ఉద్యాన పంటలను సాగు చేసే విధంగా అధికారులు ప్రోత్సహించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచించారు. గురువారం వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో చీఫ్ విప్ జీవి సమీక్ష నిర్వహించారు. అధిక ఆదాయం ఇచ్చే పంటలైన పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు వంటి పంటలను రైతులు సాగు చేసే విధంగా అధికారులు అవగాహన కలిగించి ప్రోత్సహించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్యాన పంటలకు, పరికరాలకు అందిస్తున్న రాయితీలు అంటే పథకాలను రైతులకు వివరించాలని కోరారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి రాయితీ నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ఉద్యాన పంటలతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు రైతులు ఆర్జించవచ్చని తెలిపారు. వినుకొండను హార్టికల్చర్ హబ్బుగా తీర్చి దిద్దటమే తమ ధ్యేయమని, అధికారులు సహకరించి రైతుల్లో అవగాహన పెంపొందించాలని వివరించారు. వినుకొండ నియోజకవర్గంలో ఈ సీజన్ పూర్తయ్య నాటికి 17వేల ఎకరాలలో ఉద్యానవన పంటలు కొత్తగా వేయించాలని ఉద్యాన, అనుబంధ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.(Story : ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి )

