స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు బహుళ ప్రయోజనాలు
రేషన్ ఇబ్బందులకు 1967 టోల్ఫ్రీ నంబర్తో పరిష్కారాలు
వినుకొండలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెడుతున్న స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు బహుళ ప్రయోజనాలు లభిస్తాయని వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. టెక్నాలజీ సాయంతో ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థనూ పూర్తి పారదర్శకంగా, లోపరహితంగా తీర్చిదిద్దుతోందన్న ఆయన ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందులున్నా ప్రజలు వెంటనే టోల్ఫ్రీ నెంబర్ 1967కి ఫిర్యాదు చేయాలని సూచించారు. వినుకొండలో సోమవారం స్మార్ట్రేషన్కార్డుల పంపిణీ చీఫ్విప్ జీవీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తహసిల్దార్ ఎం.సురేష్ నాయక్ అధ్యక్షత వహించారు. స్థానిక 12వ వార్డు అంబేడ్కర్ కాలనీలో లబ్దిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం జీవి మాట్లాడుతూ. రాష్ట్రంలో 30 వేల వరకు రేషన్ దుకాణాలు సేవలు అందిస్తున్నాయని, మొత్తం 1.43 కోట్లమందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రతినెలా ప్రభుత్వం ద్వారా పేదలకు చౌకబియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నామని, ఈ పథకాన్ని ఇంకా సమర్థంగా అమలు చేయడం కోసం లబ్ధిదారుల ఇంటి గడపకు చేరేలా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు ఉంటే రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా బియ్యం, సరకులు తీసుకొచ్చని చెప్పారు. గతంలో లాగా దుకాణాల వద్ద కార్డుదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ డీలర్లకు అధునాతన ఈ-పోస్ యంత్రాలను పంపిణీ చేస్తున్నామని, వేగంగా పంపిణీ చేయడానికి వారికి చాలా సులభతరం అవుతుందన్నారు. మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 650కిపైగా సేవలు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు సులువుగా సేవలు అందించే విధానాల కోసం ఎప్పుడైనా ఖర్చు పెటిందా అని ప్రశ్నించారు.జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, పెమ్మసాని నాగేశ్వరరావు, కౌన్సిలర్లు డాక్టర్ దస్తగిరి షకీలా, నాగరాజు, టిడిపి పట్టణ అధ్యక్షులు బొంకూరు రోశయ్య, నరసింహారావు, చికెన్ బాబు, మేడం రమేష్, ఎస్ కే జానీ, స్పెషల్ ఆఫీసర్ ఎం. సిద్ధ లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
*వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి:…
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు విపక్ష వైకాపా ఎమ్మెల్యేలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సమావేశాలు చాలా అర్థవంతంగా ఉంటున్నాయని, గతంలో ఉన్నట్లు గందరగోళాలు, దూషణలు లేవని, ఏ విషయంపై అయినా అర్థవంతమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజల పట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. సమస్యలపై చర్చిద్దామని, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడటానికి కావాల్సినంత సమయం కూడా ఇస్తామని, వాళ్లు అసెంబ్లీకి రావాలని కోరుతున్నామన్నారు. ఇప్పుడైనా ఆ ధైర్యం చేయకుంటే దుష్ప్రచారాలు కట్టిపెట్టాల న్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఉండబోతుందన్నారు. సమావేశాలు విజయవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు
17న స్త్రీ శక్తి విజయోత్సవ కార్యక్రమం
ఈ సందర్భంగా ఈ నెల 17న గంగినేని ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు స్త్రీ శక్తి విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, మహిళలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు చీఫ్విప్ జీవీ. అక్కడే ఉచితవైద్య పరీక్షల శిబిరం కూడా ఉంటుందని అన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు 70-80 రకాల వైద్య పరీక్షలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.(Story :స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు బహుళ ప్రయోజనాలు )

