యూరియా కొరత తీర్చకుంటే ఆందోళన బాట
న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లాలో యూరియా కొరత తీర్చకుంటే సిపిఐ రైతులకు మద్దతుగా ఆందోళన బాట పడుతుందని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ హెచ్చరించారు. శనివారం సిపిఐ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన యూరియా సకాలంలో విడుదల చేయకపోవటమే కారణమన్నారు. కానీ కాంగ్రెస్ బిజెపి ఆధిపత్య పోరాటంలో రైతులు నష్టపోతారని గుర్తించాలన్నారు. కేటాయించిన యూరియా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. వనపర్తి జిల్లా పానగల్, ఆత్మకూరు, గోపాల్పేట, గణపురం మండలంలో రైతులు రోడ్డెక్కారని గుర్తు చేశారు. పిఎసిఎస్ లు ప్రైవేట్ షాపుల వద్ద రైతుల క్యూలు కనిపిస్తూనే ఉన్నాయన్నారు. సకాలంలో యూరియా వేయకపోతే పైరు పెరగక దిగుబడి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు అన్నారు. తగినంత యూరియా రైతులకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వరి పైరుకు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని రైతులకు అవగాహన మాత్రం కల్పించడం లేదన్నారు. తగినంత మోతాదు వాడేట్లుగా చైతన్యం చేయాలన్నారు. సమస్య పరిష్కరించకపోతే సిపిఐ ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, సి.ఎన్ శెట్టి, వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు.(Story :యూరియా కొరత తీర్చకుంటే ఆందోళన బాట )

