అగ్ని ప్రమాద బాదిత కుటుంబాన్ని ఆదుకుంటాం..
– అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
– ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాదిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో గల రంగస్వామి ప్లాస్టిక్ వర్క్ వెంకటేశ్వర ట్రేడర్స్ (ప్లాస్టిక్ వ్యర్ధాల గోదాము)లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులతో కలిసి సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు తమని ఆదుకోవాలంటూ విలపిస్తూ చీఫ్ విప్ జీవి వద్ద మొరపెట్టుకున్నారు. ప్లాస్టిక్ చెత్త సేకరించే కంపెనీలో అగ్నిప్రమాదం జరగటం బాధాకరమని, ఇండస్ట్రీ యజమాని నెమలయ్య కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వలన ప్లాస్టిక్ వర్క్ స్టేటస్ లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగి ప్లాస్టిక్ భారీగా ఖాళీ బూడిద తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అగ్ని ప్రమాదం సంఘటన వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి యజమానికి అండగా నిలిచి ఆదుకోవడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల గోదాములు, కొన్ని పరిశ్రమలకు సంబంధించిన స్టాక్ పాయింట్ల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల కంపెనీలో అగ్నిప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక దళం హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకొని నరసరావుపేట, కురిచేడు నుంచి అగ్నిమాపక వాహనాలను పిలిపించి మంటలను అదుపు చేసిన ఫైర్ అధికారులను సిబ్బందిని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అభినందించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో అక్కడ చేరుకొని నీటి ట్యాంకర్లను తెప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసిన కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ను ఆయన అభినందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చీఫ్ విప్ జీవి తో పాటు దర్శి నియోజకవర్గ టిడిపి నాయకులు కడియాల లలిత్ సాగర్, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, నిశంకర్రావు శ్రీనివాసరావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:అగ్ని ప్రమాద బాదిత కుటుంబాన్ని ఆదుకుంటాం..)
