కార్పొరేట్లకు ఖనిజ సంపదను దోచి పెట్టేందుకే ఆపరేషన్ కగార్ : బాల నరసింహ
న్యూస్తెలుగు/వనపర్తి : దేశం అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టేందుకు అడవుల నుంచి నక్సలైట్లు ఆదివాసీలను తరిమేసేందుకు బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ విమర్శించారు. గురువారం వనపర్తి సిపిఐ జిల్లాలో జిల్లా కార్యదర్శి కే విజయరాములు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పనిచేస్తుందా, ప్రజల కోసమా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని బిజెపి దేశభక్తి గురించి మాట్లాడుతోందని, పోరాటంలో పాల్గొన్న వారు ఉంటే రుజువు చేయాలన్నారు. భారతదేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రిమోట్ కంట్రోల్ లో పనిచేస్తుందనిగతంలో ఎన్నడు ఈ పరిస్థితి లేదన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని బిజెపి చెబుతోందని సతీసహగమనం వంటి దురాచారాలు దేశంలో కొనసాగాలా బిజెపి నాయకులు సమాధానం చెప్పాలన్నారు. వానాకాలం మొదలైందని రాష్ట్రంలో రైతులకు విత్తనాలు ఎరువులు కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తగినన్ని ఎరువులను రాష్ట్రానికి కేంద్రం ఇవ్వలేదని చెబుతున్నారని గుర్తు చేశారు. 35 శాతం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని వెంటనే మాఫీ చేయాలన్నారు. రైతు భరోసా నాలుగు ఎకరాలు ఉన్న రైతుల వరకే వేశారని తక్కిన రైతులకు రైతు భరోసా సొమ్ము ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాస్ పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ప్రజలు రైతుల సమస్యలపై పోరాటానికి సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు, వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రయ్య, అబ్రహం, సీఎన్ శెట్టి, రవీందర్, భాస్కర్, గోపాలకృష్ణ, కుతుబ్, శ్రీహరి, డంగు కురుమయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. (Story:కార్పొరేట్లకు ఖనిజ సంపదను దోచి పెట్టేందుకే ఆపరేషన్ కగార్ : బాల నరసింహ)

