మాజీ ముఖ్యమంత్రులకు ఇంటిపోరు
తిరగబడ్డ ఆడ బిడ్డలు!
తెలంగాణలో డాడీ వర్సెస్ డాటర్
ఏపీలో బ్రదర్ వర్సెస్ సిస్టర్
పదవీ వ్యామోహమా?, ఆస్తుల పంపకమా?
ఏపీలో వైఎస్ఆర్సీపీకి షర్మిల చెక్
తెలంగాణలో బీఆర్ఎస్పై కవిత తిరుగుబావుటా
న్యూస్ తెలుగు/అమరావతి: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకున్నాయి. చారిత్రాత్మక చరిత్రకలిగిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల ఇలాకాలో కుటుంబ కుంపట్లు రేగాయి. ఇందుకు సొంత ఆడ బిడ్డలే కారణమయ్యారు. అవి రాజకీయ పదవీ దాహమా?, ఆస్తుల పంపకాలా?, విభేదాలా?, ఏవైతేనేమీ..నెమ్మదిగా చిచ్చుపెట్టేశాయి. తాజాగా డాడీపై డాటర్(తండ్రిపై తనయ) తిరుగబడగా..మరొకరు సొంత అన్న రాజకీయ పతనానికి ప్రత్యక్షంగా కారణమయ్యారు. ఒకరు..ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కాగా..మరొకరు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుర్తి చంద్రశేఖర్రరావు(కేసీఆర్). జగన్ సోదరి షర్మిల ఆయన పతనాన్నే కోరుకోగా, తాజాగా కేసీఆర్ కుమార్తె కవిత కొంత దుమారంతో హాట్ టాపిక్ అయ్యారు.
జగనన్న సంధించిన బాణం రివర్స్
2019లో ఏపీలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని అధికారం చేపట్టింది. ఆ పార్టీ 151 సీట్లు సాధించి పూర్తి మెజార్టీతో సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రెండు, మూడేళ్ల తర్వాత జగన్ సోదరి షర్మిల తాను పార్టీ పెడుతున్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాలో ఓ కథనం వచ్చింది. దానిపై షర్మిల ఎట్టకేలకు ఖండిస్తూ, బెంగుళూరు నుంచి ఒక లేఖ విడుదల చేశారు. అనుకున్నట్లే అయింది..కొన్ని నెలలకు తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ ఆవిర్భవించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా పెట్టి, ఆ రాష్ట్రమంతా పాదయాత్రలు నిర్వహించి, ధర్నాలు, నిరసనలు చేపట్టి ఆ పార్టీని నిలపాలని తపన పడ్డారు. దానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడం, ఆశించిన స్థాయిలో పార్టీలో సీనియర్లు చేరకపోవడం, నాయకత్వ లోపం వెరసి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని..ఆ రాష్ట్ర ఎన్నికల ముందే మూసివేయాల్సి వచ్చింది. షర్మిలకు ఇక గత్యంతరం లేక..అక్కడ కాంగ్రెస్కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ షర్మిల ఉంటే తమకు పోటీ ఉంటుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు భావించి, వ్యూహాత్మకంగా ఆమెను కాంగ్రెస్లోకి చేర్చుకుని, ఏపీ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో నిలిచేలా పావులు కదిపారు. దీనివెనుక టీడీపీ అనుకూలంగా ఉండే ఓ మీడియా యజమాని ఉన్నారన్న ప్రచారం వచ్చింది. ఆ తర్వాత షర్మిల ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా 2025 ఎన్నికలకు ముందు ఆమె ఏపీలోకి అడుగుపెట్టారు. పెట్టిన రోజు నుంచే తన సోదరుడు వైఎస్ జగన్పైన, వైఎస్ఆర్సీపీ పైన ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) కంటే ఎక్కువగానే…అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీపై ఘాటు వ్యాఖ్యలతో ఆమె దూసుకెళ్లారు. షర్మిల సొంత జిల్లా అయిన కడపలో కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని, పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటికీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటునూ గెలిపించలేకపోయారు. కడపలో జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసుపై అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపై ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. షర్మిల దెబ్బకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే అవినాష్రెడ్డి తండ్రి కటకటాలపాలైన పరిస్థితి దాపురించింది. ఇలా…సొంత అన్నపైనే షర్మిల తిరుగుబాటుబావుటా ఎగురవేసి, ఆయన రాజకీయ పతనాన్ని కళ్లారా చూశారు. ఆ తర్వాత ఆస్తులకు సంబంధించిన విషయాలపై తన తల్లితో లేఖలు రాయించడం లాంటి సంఘటనలు వెలుగు చూడటంతో, అది పక్కాగా రాజకీయ దాహంతోపాటు ఆస్తుల గొడవ అనే ప్రచారం వచ్చింది. నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్రలో ప్రచారం చేసిన షర్మిల సైతం..నేడు అదే బాణం జగన్కు ఎక్కుపెట్టి..చారిత్రాత్మకంగా ఆ రాజకీయ కుటుంబం చీలికకు కారణమైంది.
బీఆర్ఎస్కు కవిత స్ట్రోక్…
ఇక కవిత విషయానికొద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా కేసీఆర్ వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను స్థాపించి, క్రమేపీ బలపడుతూ, అధికారం చేపట్టే స్థాయికి తీసుకొచ్చారు. వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఆ రెండుసార్లూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. చివరి ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కాస్తా..బీఆర్ఎస్గా జాతీయ స్థాయిలో విస్తరించాలని కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ విజయభేరి మోగించింది. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, కనీసం ఒక్క ఎంపీ సీటూ రాలేదు. లోక్సభలో ఆ పార్టీ తరపున ప్రశ్నించే వారే కరువయ్యారు. నాడు అధికారంలో ఉండగా కేసీఆర్ తనయ కవిత కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె అధికారంలోకి రాకముందు, వచ్చాక ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ బలోపేతంలోను కృషి చేశారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఒక్కో కేసు కేసీఆర్ మెడకు వచ్చి చుట్టుకున్నాయి. ప్రధానంగా ఆయన ముద్దుల తనయ కవితను దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసి..జైలు పాల్జేశారు. ఆమె నెలల తరబడి జైలులో మగ్గాల్సిన పరిస్థితి దాపురించింది. చివరకు బెయిల్పై వచ్చారు. అప్పటి నుంచి ఆమె బీఆర్ఎస్లో మౌనంగానే ఉన్నారు.
ఇటీవల కేసీఆర్కు కవిత రాసిన ఓ లేఖ చిచ్చుపెట్టింది. పార్టీని ప్రక్షాళన చేయాలని, బీజేపీతో కలవొద్దని, ఇంటి దొంగలను పట్టుకోవాలని తదితర అంశాలపై రాసిన లేఖ మీడియాకు చిక్కింది. అది కాస్తా రాజరీయ రగడకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడిని రేపింది. దాన్ని అధికార కాంగ్రెస్, బీజేపీలు అస్త్రంగా ఉపయోగించుకుని, కేసీఆర్పైన, బీఆర్ఎస్పైన విమర్శల దాడికి దిగాయి. అది..డాడీ..డాటర్ గొడవా?, లేకా బ్రదర్, సిస్టర్ విభేదాలా? అంటూ బీజేపీ నేత , కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేత పొంగులేటి ఏమో..కవిత కాంగ్రెస్లోకి వస్తే తాను అడ్డుచెప్పబోనంటూ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలుగా నిలుస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ తిరుగులేని శక్తిగా ఎదుగుదామని అనుకుంటున్న తరుణంలో కవిత లేఖ..కేసీఆర్ కుటుంబంలోను, ఆ పార్టీలోను పెద్ద కుంప్పట్లు రేపినంత పనిచేసింది. కవిత వ్యవహార శైలిని చూస్తుంటే..ఆమె తిరుగుబాటు చేసేదీ..డాడీ కేసీఆర్పైనా, బ్రదర్ కేటీఆర్పైనా అనేదీ అంతుచిక్కడంలేదు. కవిత తిరుగుబాటు, ఆవేదన వెనుక పార్టీ పదవీ దాహం ఉందా?, ఆస్తుల గొడవా ?, అనేవి ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలోని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాల నుంచి ఇద్దరు ఆడ బిడ్డలు తిరగబడటం ఇప్పుడు..దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. (Story: తిరగబడ్డ ఆడ బిడ్డలు!)
Follow the Stories:
యూనియన్ బ్యాంకులో ఉద్యోగాల జాతర
ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)