మహాపుణ్యక్షేత్రం, పర్యాటకేంద్రంగా రామలింగేశ్వరస్వామి ఆలయం
రామలింగేశ్వరస్వామి గుడి, ఘాట్రోడ్డు పనులు పునఃప్రారంభించిన జీవీ, మక్కెన
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలో పల్నాడు జిల్లా, వినుకొండకే ప్రత్యేక గుర్తింపుగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మహాపుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. స్థానిక ప్రజలతో పాటు అటు రాయలసీమ, ఇటు మిగిలిన రాష్ట్ర ప్రజలందరు దర్శించుకుని పూజలు చేసుకునే విధంగా సమష్టికృష్టితో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన సంకల్పమని చెప్పారు. వినుకొండ రామలింగేశ్వరస్వామి దేవాలయం, ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను శనివారం ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ పనులను ప్రారంభించారు. అనంతరం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. వినుకొండ ప్రజల ఇలవేల్పు కొండపైన వెలసిన రామలింగేశ్వరస్వామి అన్నారు. ఆ ఆలయ నిర్మాణాన్ని మళ్లీ పునఃప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు. ఈ నిర్మాణ పనులను ప్రణాళికబద్ధంగా మాఘమాసం నాటికి పూర్తి చేయాలనే ఆకాంక్షతో కమిటీ సభ్యులందరికీ బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. ఘాట్ రోడ్డు పనులు 25శాతమే మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 75 శాతం పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాక తారురోడ్డు, సైడ్ స్లోప్స్, రక్షణ గోడలు, కాల్వలు కూడా నిర్మిస్తామని తెలిపారు. భగవంతుడు, వినుకొండ ప్రజలు, చంద్రబాబు ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. రామలింగేశ్వరస్వామి కొండను అభివృద్ధి చేసేందుకు అడిగిన వెంటనే రూ.2 కోట్ల నిధులు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధిలో వినుకొండ పట్టణంతో పాటు 5మండలాల ప్రజలు సహాయ సహకారాలు అందించి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. రామలింగేశ్వరస్వామి గుడికి పెద్ద చరిత్ర ఉందని, శ్రీరామచంద్రుడు ఈ రామలింగేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రసిద్ధని చెప్పారు. జటాయువు పక్షి శ్రీరాముడికి మొట్టమొదటగా సీతమ్మ వార్త జాడ చెప్పినటువంటి కొండ ఈ రామలింగేశ్వరస్వామి కొండని పేర్కొన్నారు. సీతమ్మ జాడ ఈ కొండపై విన్నారు కావున దీనికి వినకొండ అనే పేరు వచ్చిందని వెల్లడించారు. అందుకే ప్రభుత్వ సహకారంతో పాటు ప్రజలందరినీ భాగస్వామ్యులను చేస్తామని, ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి విస్తృతంగా విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు అధికారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. (Story:మహాపుణ్యక్షేత్రం, పర్యాటకేంద్రంగా రామలింగేశ్వరస్వామి ఆలయం)

