కేజీబీవీల ఏర్పాటులో రాష్ట్రానికే మోడల్గా పల్నాడు
వినుకొండ, బొల్లాపల్లిలో కేజీబీవీ వసతి భవనాలకు లావు, జీవీ శంకుస్థాపన
న్యూస్ తెలుగు/వినుకొండ : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటులో రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పల్నాడులో 24 వరకు కేజీబీవీలు ఉండటం ఒక రికార్డు అని తెలిపారు. గతంలో పదో తరగతి వరకు ఉండే ఈ విద్యా సంస్థల్లో ఇంటర్ కూడా వచ్చిన తర్వాత ఆదరణ మరింత పెరిగిందని, జిల్లా ప్రజలు ఈ విద్యా సంస్థలను సద్వినియోగం చేసుకోవాలని వారిద్దరూ కోరారు. వినుకొండ, బొల్లాపల్లిలో నూతనంగా నిర్మించనున్న కస్తూర్బా గాంధీ బాలికల వసతి భవనాలకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. వినుకొండ ఎన్నెస్పీ స్థలంతో పాటు బొల్లాపల్లిలో రూ.2.50 కోట్ల చొప్పున వసతిగృహాలను నిర్మిస్తున్నారు. అందుకు సంబంధించిన శిలాఫలకాలను లావు శ్రీకృష్ణదేవరాయలు, జీవీ ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ. ఆడిపిల్లలు అంటే 18 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసి పంపిద్దామనే ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు మహిళలకు కూడా ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నామని, అందరూ బాలికలను చదవించాలన్నారు. ఇంటర్లో 70 శాతానికిపైగా మార్కులు వచ్చిన ఎస్టీ బాలికలకు విజ్ఞాన్ విద్యా సంస్థల్లో ఉచితంగా ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వరికపూడిశెల ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేస్తామని, అందుకు సంబంధించి నిధుల సమీకరణకు తమ ఆలోచనలను సీఎం చంద్రబాబు ముందుంచామని, ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారని, త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అనంతరం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. బొల్లాపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణానికి రూ.2.50 కోట్ల ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వినుకొండ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన, కరవుపీడిత ప్రాంతాల్లో ఒకటైన బొల్లాపల్లికి ఇలాంటి విద్యా సంస్థలు ఒక వరమన్నారు. వైసీపీ పాలనలో విద్యతో పాటు పిల్లల భవిష్యత్తును కూడా గాలికొదిలేశారని, ఐదేళ్ల పాలనలో విద్యార్థులు, విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేశారని, ఒక్క భవనం కూడా కట్టలేదని ఆక్షేపించారు. మంత్రి లోకేష్ విద్యా సంస్థలను ఆధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దుతున్నారని, అందుకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమకూరుస్తున్నారని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంచడానికి అన్ని విధాల కృషి చేస్తున్నారని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలను పెంచుతున్నారని, పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన అన్ని వసతులతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దుతున్నారని జీవీ ఆంజనేయులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు యార్లగడ్డ లెనిన్ కుమార్, పెమ్మసాని నాగేశ్వరావు, కౌన్సిలర్ షకీలా, తదితరులు పాల్గొన్నారు.(Story : కేజీబీవీల ఏర్పాటులో రాష్ట్రానికే మోడల్గా పల్నాడు )