Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఇంటికో పారిశ్రామికవేత్త.. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యం

ఇంటికో పారిశ్రామికవేత్త.. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యం

ఇంటికో పారిశ్రామికవేత్త.. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యం

బొల్లాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి లావు, జీవీ ఆంజనేయులు శంకుస్థాపన

న్యూస్ తెలుగు / వినుకొండ : అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యం దిశగా ప్రతి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈల పార్కులు ఏర్పాటు చేస్తుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఐదేళ్లలో 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీ మేరకే సీఎం చంద్రబాబు పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారని వారిద్దరూ తెలిపారు. ఆ పారిశ్రామిక ప్రగతిలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భారీగా అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. బొల్లాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. మొత్తం 70 ఎకరాల్లో రూ.7 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. బొల్లాపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని లావు శ్రీకృష్ణదేవరాయలు విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంలో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పుతున్నారని, మొదటి విడతగా 1,455 ఎకరాల్లో రూ.595 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విద్యుత్ సహా పలు విభాగాల్లో మహిళలకు ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు కల్పిస్తుందన్నారు. మన పల్నాడు ప్రాంతంలో కూడా అనేకమంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని, అలాంటివారంతా ముందుకొచ్చి ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తే అనుమతులు కూడా వేగవంతంగా వస్తాయని జీవీ ఆంజనేయులు తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు మంత్రి లోకేష్‌ మరో అడుగు ముందుకు తీసుకెళ్లారని, 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌కు లోకేష్ భూమిపూజ చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను నిర్లక్ష్యం చేసిందని, పరిశ్రమల విషయంలో వైసీపీకి ఒక విధానం అంటూ లేదని, అభివృద్ధి వ్యతిరేక పరిపాలన సాగించిందని మండిపడ్డారు. కొత్త పెట్టుబడులను రానివ్వలేదని, ఉన్న పరిశ్రమలను కూడా తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. స్థానికంగా చదువుకున్న యువతను కూడా ప్రోత్సహించి ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి ప్రభుత్వం అందిస్తుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టామని, వారికి ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.కోటి వరకు రాయితీ రుణాలు ఇస్తోందని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో గత ప్రభుత్వం తెచ్చిన అర్థంలేని నిబంధనలు తొలగించి సులభంగా అనుమతులు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు యార్లగడ్డ లెనిన్ కుమార్, కె.నాగశ్రీను, తదితరులు పాల్గొన్నారు. (Story:ఇంటికో పారిశ్రామికవేత్త.. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!