ఎన్నికల వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలి
ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం
న్యూస్తెలుగు/వనపర్తి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యం.బాల్ నరసింహ డిమాండ్ చేశారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) వనపర్తి జిల్లా సమితి సమావేశం కామ్రేడ్ మోష అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎం.బాల నరసింహ మాట్లాడుతూ:- పాకిస్తాన్లో ఉన్నటువంటిఉగ్రవాదులను అంతమోందిచే విధంగా కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వచర్యలను భారత కమ్యూనిస్టు పార్టీ స్వాగతిస్తుంది కానీ ఇరుదేశాల పౌరులకు ఎలాంటి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత ఇరు దేశాల ప్రభుత్వాలకు ఉందని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగంగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలనలో సామాన్య ప్రజలు జీవించలేని స్థితి నెలకొన్నదని ఆరోపించారు. చీటికిమాటికి పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ లాంటి నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత కెసిఆర్ ప్రభుత్వం మాదిరిగా మాటలతో కాలం వెళ్లదీయకుండా ఆరు గ్యారంటీల హామీల అమలకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ భరత గడ్డపై ఆవిర్భవించి 100 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గ్రామ గ్రామాల్లో సిపిఐ రాజీలేని పోరాటాలను, వీరోచిత త్యాగాల ఘట్టాలను పార్టీ శ్రేణులకు ప్రజలకు వివరిస్తూ గ్రామస్థాయి నుండి పార్టీ ప్రజాసంఘాల పెంపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఐ శ్రేణులు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కే.విజయ రాములు, సిపిఐ జిల్లా నాయకులు జే.చంద్రయ్య,మోష, శ్రీహరి, అబ్రహం,సి.నరసింహ శెట్టి, జీ.రమేష్, గోపాలకృష్ణ, కురుమయ్య,రవీందర్, మాషప్ప, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి కుతుబ్, మహేష్,బాలరాజ్,భరత్, ఏఐటీయూసీ రాష్ట్ర నేత పి.సురేష్ తదితరులు పాల్గొన్నారు. (Story:ఎన్నికల వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలి)