మార్కులతో పాటు విలువలతో కూడిన విద్య అందించడమే లక్ష్యం
విద్యా ప్రమాణాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చర్యలు: చీఫ్ విప్ జీవీ..
న్యూస్ తెలుగు /వినుకొండ : విద్యార్థులకు మంచి మార్కులతో పాటు విలువలతో కూడిన విద్యాను అందించేలా ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. విద్యా సంస్కరణల్లో భాగంగా మంత్రి లోకేష్ తల పెట్టిన మోడల్ స్కూల్స్ ద్వారా రానున్న రోజుల్లో దేశానికే ఆదర్శంగా ఏపీ మారబోతుందన్నారు. మంగళవారం నరసరావుపేట పట్టణం భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లాస్థాయి పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల అభినందన సభలో చీఫ్ విప్ జీవీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 580కి పైగా మార్కులతో ఉత్తమఫలితాలు సాధించిన విద్యార్థులు అందర్నీ అభినందించారు. రాష్ట్ర సగటు కంటే మంచిఫలితాలు సాధించినందుకు పల్నాడు జిల్లా విద్యార్థులు, టీచర్లను అభినందించారు. స్టేట్-1 ర్యాంకు పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతానికి రావడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. 598మార్కులు సాధించిన చంద్రికకు అభినందనలు. 596 మార్కులు సాధించిన సమీర, 593మార్కులు సాధించిన అమూల్యలకు ప్రత్యేక ప్రశంసలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈసారి మంచిఫలితాలు వచ్చాయన్న జీవీ లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాల విద్య రూపురేఖలే మార్చుతున్నారని తెలిపారు. టీచర్ల నైపుణ్యా లు పెంపొందించేందుకు శిక్షణ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల కోసం కార్యక్రమాలు నిర్వహించ బోతున్నారని అన్నారు. విద్యార్థి దశలోనే మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, శాసనసభ్యులు అరవిందబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.(Story:మార్కులతో పాటు విలువలతో కూడిన విద్య అందించడమే లక్ష్యం)
