ప్రధాని మోదీ పర్యటనతో ఏపీ అభివృద్ధిలో నవశకం
అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ మే2 సభతో తొలగిపోతాయి: జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నవశకం ప్రారంభం కాబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలోనే అమరావతికి శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలకు చేయూత ద్వారా ఆయన ఎంతో చేయూత నిచ్చారని, దురదృష్టవశాత్తు జగన్ హయాంలో అవన్నీ ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి అ అభివృద్ధి యజ్ఞం ప్రారంభించేందుకు మే 2న వస్తున్న ప్రధాని మోదీ సభ కోసం భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నామన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఏపీ లీడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావుతో కలిసి వినుకొండలో జీవీ ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. ప్రధాని మోదీ సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీయే నాయకులంతా సమైక్యంగా పనిచేస్తున్నారన్నారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు వినుకొండ నియోజవర్గం వ్యాప్తంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వినుకొండ నియోజకవర్గం నుంచి 5 వేలమంది, పల్నాడు జిల్లా నుంచి 30 నుంచి 50 వేలమంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్గా మక్కెన మల్లికార్జునరావుకు అవకాశం ఇచ్చినందుకు అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ.. అమరావతికి గతంలో అన్న ఆటంకాలను ప్రధాని మోదీ తొలగిస్తారని నమ్మకం ఉందన్నారు. పార్లమెంట్లో అమరావతికి సంబంధించి బిల్లును కూడా ఆమోదం తెలిపేలా చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారని,,, కూటమి పాలన వచ్చాక రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. (Story:ప్రధాని మోదీ పర్యటనతో ఏపీ అభివృద్ధిలో నవశకం)
