పోలీసుల వేధింపుల కారణంగా వైఎస్సార్ సీపీ కార్యకర్త రఫీ ఆత్మహత్యాయత్నం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని ఉమ్మడివరం గ్రామానికి చెందిన షేక్ రఫీ, గత కొన్ని రోజులుగా పోలీసుల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. రఫీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తగా ఉంటూ, స్థానిక టీడీపీ నాయకుల పట్ల చేసిన వ్యాఖ్యల కారణంగా పోలీసుల వద్ద పలు వేధింపులు ఎదుర్కొన్నాడు. పోలీసులు అతడిని నిరంతరం స్టేషన్ కు పిలిపించి, మానసికంగా వేధించి, దారుణంగా కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల, రఫీని ఎస్ ఐ సత్యనారాయణ పోలీసు స్టేషన్ కి పిలిపించి దారుణంగా అవమానించి చిత్రహింసలకు గురిచేశారని, టీడీపీ నాయకుల కాళ్లు పట్టి క్షమాపణ అడగమని చెప్పినట్లు రఫీ వెల్లడించారు. ఈ తీవ్ర వేధింపుల కారణంగానే, రఫీ మనస్తాపానికి గురై, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రఫీని పరామర్శించి, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు ఏవీ జరగలేదు. ఇప్పుడు పేదవాడిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రఫీకి న్యాయం జరగాలని, కోర్టు ద్వారా ప్రవేట్ కేసు వేసి రఫీ కుటుంబానికి వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని అన్నారు. (Story : పోలీసుల వేధింపుల కారణంగా వైఎస్సార్ సీపీ కార్యకర్త రఫీ ఆత్మహత్యాయత్నం)