సిద్దమవుతున్న నూతన సంవత్సర పూల బొకే లు
కడియం నుంచి రాష్ట్ర నలుమూలలకు
న్యూస్తెలుగు/చింతూరు : నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడంలో పూల బొకేలు కీలకపాత్ర పోషిస్తాయి. పలు రకాల పువ్వులతో ఈ బొకేలు తయారు చేస్తుంటారు. అయితే పువ్వులకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండల వ్యాప్తంగా తయారయ్యే ఈ బొకేలు రాష్ట్రం నలుమూలకు సరఫరా అవుతాయి. బుధవారం జరిగే ఈ నూతన సంవత్సర వేడుకలకు అవసరమైన బొకేలను సోమవారం నుంచి పెద్ద ఎత్తున తయారీ మొదలుపెట్టారు. కడియపులంక కేంద్రంగా తయారయ్యే ఈ బొకే లకు ఎక్కడలేని డిమాండ్ ఉంటుంది.కడియపులంకతో పాటు బుర్రిలంక, కడియం, కడియపుసావరం తదితర గ్రామాల్లో ఈ బొకేల తయారీ చేపడుతున్నారు. కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేసి రాష్ట్ర నలుమూలకు బస్సులు,రైళ్లు ద్వారా సరఫరా చేస్తారు.అదే మాదిరిగా ఈ బొకేలను ఆర్డర్లపై తయారు చేస్తున్నారు. వందలాది మంది ఇప్పుడు ఈ బొకేల తయారీలో నిమగ్నమై ఉన్నారు.
వంద రూపాయలు బొకే నుంచి ఆర్డర్ పై పదివేల రూపాయల విలువైన బొక్కలను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు.బెంగుళూరు, ఊటీ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పూలను దిగుమతి చేసుకొని బొకేలు తయారు చేస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాలకు ఇక్కడ బొకేలు పెద్ద మొత్తంలో తీసుకెళ్లి రిటైల్ గా అమ్మకాలు సాగిస్తుంటారు.
ఈ బొకే ల తయారీలో ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకున్న జర్బరా,ఆర్కెడ్,స్నోన్ బాల్,గ్లాడ్,తార్నుషన్,రిషాంత్,డచ్చీ రోజెస్ వంటి ఖరీదైన పూలను వినియోగిస్తారు. (Story : సిద్దమవుతున్న నూతన సంవత్సర పూల బొకే లు)