ఉచిత ఇసుక సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా
న్యూస్ తెలుగు/విజయవాడ : వినియోగదారులకు ఏవిదమైన ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఉచిత ఇసుకను సరఫరా చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా సంబందిత అధికారులను ఆదేశించారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా కంచికచర్ల మండలం పెండ్యాల 1, 2 రీచ్ల పరిధిలోని నందిగామ మండలం కంచెల గ్రామంలోని ఇసుక స్టాక్ యార్డ్, వత్సవాయి మండలం శనగపాడు, ఇందుపల్లి స్టాక్ యార్డ్లను బుధవారం జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 15 రీచ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని దీనిలో భాగంగా తొలత నాలుగు రీచ్లను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం కృష్ణాలో నీటి ప్రవాహం ఉన్నందున 11 రీచ్ల్లో ఇసుకను అందుబాటులో ఉండగా ప్రవాహం తగ్గిన వెంటనే మిగతా రీచ్లలో ఇసుకను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన నాలుగు రీచ్లలో 3 లక్షల 69 వేల మెట్రిక్ టన్నులతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న మొాగులూరు, కీసర, అనుమంచిపల్లి స్టాక్ యార్డ్లతో కలిపి మొత్తం 15 రీచ్లలో 11 లక్షల 6వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ప్రారంభించిన రీచ్లకు మ్యాపింగ్ నిర్వహిస్తున్నందున నేటి నుండి అన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఇసుకను అందుబాటులో ఉంచుతామన్నారు. కొత్తగా ప్రారంభించిన రీచ్లలో జిల్లా ఇసుక స్థాయి కమిటీ టన్ను ఇసుక రూ.232 ధరను నిర్ణయించినట్లు తెలిపారు. ఉచిత ఇసుక విధానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించడంతో పాటు ఇసుక సరఫరాపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. స్టాక్ యార్డుల్లో ఇసుక సరఫరా, నిల్వలకు సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు ప్రదర్శించడంతో పాటు అన్లైన్లో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గనులు భూగర్భ శాఖ సహయ సంచాలకులు వీరాస్వామి, నందిగామ ఆర్డీవో బాలకృష్ణ పాల్గొన్నారు.(Story : ఉచిత ఇసుక సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవాలి)