తెలంగాణ రైతాంగ సాయిధ పోరాటం తోనే విలీనం : కే శ్రీరామ్
న్యూస్తెలుగు/ వనపర్తి : సిపిఐ నేతృత్వంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోనే నిజాం నవాబ్, రజాకర్ల, భూస్వాముల పాలన నుంచి తెలంగాణ విముక్తమై భారత దేశంలో విలీనమైందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్, రమేష్ అన్నారు. గోపాల్పేట మండలం పోలికపాడు లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించారు. నాటి పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దూ మహిముద్దీన్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, జర్నలిస్ట్ సోయబుల్లాఖాన్ చిత్రపటాలకు, సీనియర్ నేత జె చంద్రయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ‘బాంచన్ నీ కాల్మొక్త’అని నిజాముకు వెట్టి చేస్తున్న సామాన్య ప్రజలను పోరాట వీరులుగా మలిచింది కమ్యూనిస్టులే నన్నారు. 3000 గ్రామాలను భూస్వముల నుంచి విముక్తం చేసి పది లక్షల ఎకరాలను పేదలకు పంచిందని, ఈ పోరాటంలో 4500 మంది అమరులయ్యారన్నారు. ఈ మహత్తర పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ తగ్గిందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం పాలకుల వైఫల్యం వల్ల అమరుల ఆశయాలు నెరవేరలేదన్నారు. వారి పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలన్నారు.
ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎత్తం మహేష్, లక్ష్మీనారాయణ, విష్ణు,సిపిఐ గోపాల్పేట మండల కార్యదర్శి నాగన్న, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : తెలంగాణ రైతాంగ సాయిధ పోరాటం తోనే విలీనం : కే శ్రీరామ్)