ధాన్యం విక్రయించిన 4 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ
నడిగడ్డలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జీవి
రైతును నట్టేట ముంచిన వైసిపి ప్రభుత్వం: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ :
ధాన్యం విక్రయించిన నాలుగు గంటలలోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. డిఆర్డిఏ వెలుగు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని నడిగడ్డ గ్రామంలో డ్వాక్రా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ ఎప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని, రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తుందన్నారు. రైతులకు ప్రభుత్వానికి మధ్యలో దళారి వ్యవస్థ లేకుండా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్ బి కే, సొసైటీలు, యార్డుల్లో, వెలుగు డ్వాక్రా సంఘాల ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు గంటల తరబడి వేచి ఉండకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ధాన్యం అమ్మిన నాలుగు గంటల్లో నగదు జమ అవుతుందని, సాంకేతిక సమస్య ఉంటే 24 గంటల్లోపు రైతు ఖాతాల్లో తప్పనిసరిగా నగదు జమ అవుతున్నాయని తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా వినుకొండ లో ప్రారంభించడం సంతోషకరమన్నారు. నియోజకవర్గంలో 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వెలుగు ద్వారా మరో అయిదు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు జరగటం వలన దళారుల ప్రమేయం తగ్గి రైతులు సరైన ధర పొందడంతో పాటు, కొంత డ్వాక్రా సంఘాల మహిళలకు మేలు జరుగుతుందని వివరించారు. క్వింటా ధాన్యం రూ.2389, 75 కిలోల ధాన్యం రూ.1792 ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు జరుగుతున్నాయన్నారు. గత వైసిపి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని ఆయన ధ్వజమెత్తారు. వైసిపి పాలనలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడం, రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వలన రైతుల తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. రైతులు నష్టపోకుండా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సులభతరం చేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.(Story:ధాన్యం విక్రయించిన 4 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ)

