ఇంటి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వినుకొండ
95 శాతం లక్ష్యం పూర్తి.. సిబ్బందికి, ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణ స్థానిక సంస్థల్లో ఇంటి పన్ను వసూళ్లలో వినుకొండ పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని మొత్తం 126 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు గాను.. అత్యధికంగా 95 శాతం పన్ను వసూలు చేసి వినుకొండ మున్సిపాలిటీ ఈ ఘనత సాధించింది. మున్సిపాలిటీ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 6.58 కోట్ల పన్నుల డిమాండ్ ఉండగా, రికార్డు స్థాయిలో రూ. 6.25 కోట్లు (95%) వసూలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కోడూరు శివరామ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి విశేషంగా కృషి చేసిన రెవెన్యూ ఆఫీసర్ శ్రీ కె.వి. కోటేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీ కె. మణికంఠ, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో పాటు అవుట్ సోర్సింగ్ రెవెన్యూ సిబ్బందికి కమిషనర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే, పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీకి సహకరించిన వినుకొండ పట్టణ ప్రజలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(Story : ఇంటి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వినుకొండ )
