లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ నిరసన
న్యూస్ తెలుగు/వినుకొండ : కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఏప్రిల్ 1 నుంచి కొత్తగా లేబర్ కోడ్లను అమలు చేయడాన్ని నిరసిస్తూ వినుకొండలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు కొప్పరపు మల్లికార్జున మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు తొత్తుగా మారారని మండిపడ్డారు. బ్రిటీష్ కాలం నుంచి కార్మికులు ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలమైన 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని విమర్శించారు. జాతీయ కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్లో ఏకపక్షంగా వీటిని ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోడ్ల వల్ల కార్మికులకు యూనియన్లు ఏర్పాటు చేసుకునే, యాజమాన్యాలతో బేరసారాలు ఆడే, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేకుండా పోతుందన్నారు. గత ఫిబ్రవరి 12న సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో కోట్లాది మంది ఆందోళనలు చేపట్టినా ఖాతరు చేయకుండా.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లను అమలు చేయాలని నియంతృత్వంగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఈ లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాయబారం వందనం, రాచపూడి ఏసుపాదం, సంపెంగల అబ్రహం రాజు, పచ్చిగొర్ల యేసు, కంచర్ల కోటేశ్వరరావు, సాయి తదితర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.(Story : లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ నిరసన )
