ఖాళీ సిలిండర్, కట్టెల పొయ్యి వంట చేసి సిపిఐ వినూత్న నిరసన
న్యూస్ తెలుగు/వనపర్తి : దేశంలో గ్యాస్ ధర పెంచటాన్ని నిరసిస్తూ వనపర్తి అంబేద్కర్ చౌక్ లో సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్ కు దండ వేసి, కట్టెల పొయ్యి పై వంట చేసి వినూత్న నిరసన తెలిపారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అమెరికా ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధం పేరుతో వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 60, వాణిజ్య సిలిండర్ ధరను రూ. 115 కు పెంచటం బిజెపి నరేంద్ర మోడీ పాలనా వైఫల్యానికి నిదర్శనమని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ పట్టణ కన్వీనర్ జయమ్మ విమర్శించారు. ట్రంపు తనకు దోస్తునని గొప్పలు చెబుతున్న నరేంద్ర మోడీ ఎందుకు యుద్ధాన్ని నివారించడం లేదని, గ్యాస్ ధరలను ఎందుకు సామాన్యులు మోయలేనంతగా పెంచుతున్నారని విమర్శించారు. గ్యాస్ దొరికే పరిస్థితి లేక హోటల్లు గ్యాస్ తో చేస్తే ఉత్పత్తులన్నీ ఆగిపోయి దేశం అస్తవ్యస్తంగా మారిందన్నారు. దేశంలో ఎక్కడ గ్యాస్ దొరకకపోయినా కొరతలేదని బుకాయిస్తున్న అబద్దాల నరేంద్ర మోడీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.యుద్ధం నేపథ్యంలో గ్యాస్ను తగినంత నిలువ చేసుకోలేని అసమర్ధుడైన మోడీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ‘పెరిగే ధరలకు హద్దే లేదు… ఏలేవానికి బుద్దే లేదు’ ‘పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధరల పెరుగుదలపై రికార్డు చేసి వినిపించిన పాటలు ప్రజలను ఆకర్షించాయి. ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు, మాజీ కార్యదర్శి కళావతమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు పట్టణ కన్వీనర్ జయమ్మ తదితరులు మాట్లాడగా, తెల్ల రాళ్లపల్లి మాజీ ఉప సర్పంచ్ కాకం బాలస్వామి, చిన్న కురుమన్న, ఎర్రకురుమన్న, పృథ్వి నాదం, రమణ, వంశీ, వెంకటమ్మ, జ్యోతి, సుప్రియ, ఖాసీం బీ, ఖాజా, అలివేల, మైనూస్ తదితరులు పాల్గొన్నారు.(Story : ఖాళీ సిలిండర్, కట్టెల పొయ్యి వంట చేసి సిపిఐ వినూత్న నిరసన )
