‘విజువల్ క్లీన్ వినుకొండ’గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా ‘స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26’ అవగాహన కార్యక్రమం
న్యూస్ తెలుగు – వినుకొండ : రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా ఐఏఎస్ ఆదేశాల మేరకు వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26’ అవగాహన కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనలతో, మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ పర్యవేక్షణలో పల్నాడు రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ నందు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ శివరామ ప్రసాద్ మాట్లాడుతూ. విద్యార్థులకు స్వచ్ఛభారత్ మిషన్ ప్రధాన ఉద్దేశాలను వివరించారు. తడి, పొడి మరియు హానికరమైన చెత్తను ఎప్పటికప్పుడు వేరుచేసి, సంబంధిత నిర్వహణ కేంద్రాలకు తరలించడం వల్ల పర్యావరణానికి జరిగే మేలును తెలియజేశారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సమాజం కోసం పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పర్యావరణానికి ముప్పుగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానివేసి, వాటి స్థానంలో క్లాత్, జూట్ బ్యాగులను మాత్రమే వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. వంటింటి నుంచి వచ్చే తడి చెత్తతో ఇళ్లల్లోనే కంపోస్ట్ (హోం కంపోస్ట్) తయారు చేసుకునే విధానాన్ని ప్రోత్సహించారు. ఈ కంపోస్ట్ను టెర్రస్ గార్డెనింగ్ కోసం వాడుకోవచ్చని సూచించారు. రహదారులపై, ఖాళీ ప్రదేశాల్లో, మురుగు కాలువల్లో చెత్త వేయకుండా పట్టణాన్ని “విజువల్ క్లీన్ వినుకొండ” గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం మనందరి సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినుకొండకు మెరుగైన ర్యాంకు సాధించే దిశగా అందరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు శానిటరీ సెక్రటరీలు, శానిటరీ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. (Story:‘విజువల్ క్లీన్ వినుకొండ’గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి)

