సీఎం పర్యటనకు వినుకొండలో భారీ బందోబస్తు ఏర్పాట్లు — జిల్లా ఎస్పీ పర్యవేక్షణ
న్యూస్ తెలుగు/వినుకొండ : ఈ నెల 21న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండ పర్యటనకు రానున్న నేపథ్యంలో పట్టణంలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. “స్వచ్ఛ ఆంధ్ర–స్వర్గాంధ్ర” కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు గత రెండు రోజులుగా వివిధ ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లను ఖరారు చేస్తున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కృష్ణారావు వినుకొండకు చేరుకుని ఎన్ఎస్పి గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్న ప్రజా దర్బార్ వేదికను పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే స్థలం గుర్తించి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ను కూడా సందర్శించి ఏర్పాట్లపై అధికారుల నుండి ఆరా తీశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం, అక్కడి రెండు ప్రధాన ప్రవేశ ద్వారాలను పరిశీలిస్తూ భద్రతా ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. ఎన్ఎస్పి గ్రౌండ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, ఆసుపత్రి ఆవరణల్లో పనులు యుద్ధప్రాతిపదికన శరవేగంగా సాగుతున్నాయి. ఎస్పీతోపాటు ఆర్డీవో మధులత, వివిధ శాఖలకు చెందిన అధికారులు స్థానిక తహసిల్దార్ ఎం సురేష్ నాయక్, పట్టణ సీఐ ప్రభాకర్, రూరల్ సీఐ బ్రహ్మయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.(Story : సీఎం పర్యటనకు వినుకొండలో భారీ బందోబస్తు ఏర్పాట్లు — జిల్లా ఎస్పీ పర్యవేక్షణ )

