పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన గురువారం వనపర్తి పట్టణంలోని 12వ వార్డు రాజనగరంలో, వనపర్తి పట్టణంలోని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. రాజనగరం 12వ వార్డు అభ్యర్థి అయిన నక్క రాణి రాజు గారిని, 11వ వార్డు అభ్యర్థి అయిన తులసి తిరుపతయాదవ్ గారిని గెలిపించాలని కోరుతూ ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారానికి ఆయా వార్డుల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే గారికి కౌన్సిలర్ గా పోటీలో ఉన్న అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో, మంగళహారతులతో, కుంకుమ తిలకం దిద్ది, పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, రానున్న మరో 5 సంవత్సరాలు కలుపుకొని మొత్తం 8 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని అధికార పార్టీకి ఓటేస్తేనే వాడ వాడన అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు హస్తం గుర్తుపై ఓటేసి పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. వనపర్తి లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేనున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నారని మన ఎంపీగా డా: మల్లురవి ఉన్నారని కౌన్సిలర్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటేనే పట్టణాల్లో వేగవంతంగా అభివృద్ధి సాధ్యమవుతుందని ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటేసిన ఎలాంటి ఉపయోగం ఉండదని ప్రజలు దీనిని గమనించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. పది సంవత్సరాల BRS పాలనలో వార్డులలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, కేవలం కమిషన్ను దండుకోవడం కోసం చెరువు కట్టల మరమ్మత్తు చేపట్టి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. 33 వార్డులల్లో కేవలం మౌలిక సదుపాయాల కోసం దాదాపు 100 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, కాలనీలలో విద్యుద్దీకరణ, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వనపర్తి పట్టణంలోని 33 వార్డులలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇందుకు సహకరించగలరని ఆయన సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పార్టీ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story : పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం )

