రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి, రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతి..
*వినుకొండను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చడమే లక్ష్యం.
*ఎమ్మెల్యేగా వచ్చే వేతనం రైతులు, దివ్యాంగులకే ఖర్చు..
*రైతు విజ్ఞాన యాత్ర ప్రారంభంలో చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి, రైతు ప్రగతే రాష్ట్రప్రగతి అన్న నమ్మకం, నినాదంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ చీఫ్విప్, వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి కలలుగంటున్న స్వర్ణాంధ్ర సాధనకు ఇదే తొలి మెట్టు అన్నారు. వినుకొండను హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. వినుకొండ నియోజకవర్గంలోని రైతులు గురువారం ఉద్యాన విజ్ఞాన యాత్రకు తరలివెళ్లారు. యాత్ర వాహనాలను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ఉద్యాన రైతుల విజ్ఞాన యాత్రలో భాగంగా ఏలూరు జిల్లా పెదవేగి, జంగారెడ్డిగూడెంలో 2 రోజు ల పాటు పామాయిల్ తోటలు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా చీఫ్విప్ జీవి మాట్లాడుతూ. ఉద్యానపంటల ద్వారా రైతులకు ఎకరాకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం వస్తోందని, అవే అవకాశాలు మిలిగిన రైతులు కూడా అందిపుచ్చుకోవాలన్నారు. కూరగాయ పంటల్లోనూ ఎకరాకు రూ. 2-3 లక్షల ఆదాయం వస్తోందని, విజ్ఞానయాత్రల ద్వారా ఆయా అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. 40 నుంచి 50వేల ఎకరాల్లో ఉద్యాన పంటల్ని ప్రోత్సహించడం ద్వారా వినుకొండను కూడా ఒక హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని సంకల్పంగా పెట్టుకున్నామన్నారు. పామాయిల్ పంట ద్వారా 30 ఏళ్లపాటు స్థిరమైన ఆదాయం వస్తుందని, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అది నిరూపణైందన్నారు. అందుకోసం ఇకపై ఎమ్మెల్యేగా ప్రతి నెలా వచ్చే జీతాన్ని రైతు విజ్ఞాన యాత్రలు, దివ్యాంగులు, నియోజకవర్గాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలకు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్లో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా ఇలాంటి పంటల్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. వరి వంటి సాధారణ పంటలతో తక్కువ ఆదాయం వస్తోన్న నేపథ్యంలో డిమాండ్ ఆధారిత పంటలవైపు మారడం అనివార్యమని, రైతులు గుర్తించాలని సూచించారు. 90% రాయితీతో డ్రిప్, రాయితీపై డ్రోన్లు, యంత్రపరికరాల పథకాల్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు. రైతుబాగు కోసం చంద్రబాబు తెచ్చిన పంచసూత్రాలతో తప్పక విజయం సాధిస్తామన్నారు. గత ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా రైతుల్ని నిర్లక్ష్యం చేయడమే కాక పథకాలు, రుణాలు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో మాత్రం దిగుబడులు పెంచే అగ్రిటెక్పై దృష్టి పెట్టి పనిచేస్తున్నామని, ఏఐ ని కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఈ సందర్భంగానే దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన వరాలపై హర్షం వ్యక్తం చేశారు. ఉచితబస్సు ప్రయాణం, సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అర్బన్ హౌసింగ్లో గ్రౌండ్ఫ్లో దివ్యాంగులకు కేటాయించడం చాలా గొప్ప విషయం అన్నారు. దివ్యాంగ విద్యార్థుల కు ఉపకారవేతనాలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం చాలామంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాసరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, వ్యవసాయ అధికారులు ఏడిఏ రవికుమార్, ఏవో వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story:రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి, రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతి..)

