నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ
న్యూస్ తెలుగు/వనపర్తి : భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ గారు దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి నిరుపేదల అభ్యున్నతికి వెన్ను దన్నుగా నిలిచి ఉక్కు మహిళగా పేరుగాంచారని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా బుధవారం వనపర్తి పట్టణం ఇందిరా పార్క్ లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గరీబి హటావో అని నినందించి సీలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చి భూమిలేని నిరుపేదలకు సాగు భూమిని అందించి నిరుపేదల అభ్యున్నతికి పాటుబడ్డారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బ్యాంకులను జాతీయకరణ చేసి నిరుపేదలకు బ్యాంకు సేవలను అందుబాటులో తెచ్చారన్నారు. హరిత విప్లవం తీసుకొచ్చి పంటలు దిగుబడి పెంచి అన్నదాతల శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తి ఇందిరాగాంధీని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ గారి కుటుంబం పూర్తిగా ప్రజాసేవకై ప్రాణాలర్పించారని ఆయన అన్నారు.ధీరశాలి అయిన ఇందిరా గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం పాటుపడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(story : నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ )

