ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించకుంటే ఆందోళన బాట
న్యూస్ తెలుగు/వనపర్తి : పానగల్ మండల గ్రామాల్లో ఇంతవరకు ఒక్క వడ్ల గింజ కొనలేదని పిఎసిఎస్, ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యాన్ని కొనుగోలు వెంటనే ప్రారంభించాలని, లేదంటే రైతులతో కలిసి కేంద్రాల వద్ద ధర్నాలు చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ హెచ్చరించారు. పానగల్ మండలం పలు గ్రామాల కేంద్రాల్లో సమస్యలు తెలుసుకున్న వారు కేతపల్లి కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రారంభోత్సవాల కోసం ముహూర్తాలు, అతిథుల కోసం వేచి చూడడం సరికాదన్నారు.కేంద్రాల్లో ధాన్యం పోసి 10 నుంచి 21 రోజులుగా ఆరబెట్టారని తేమశాతం రాలేదన్న సాకుతో కొనుగోలు చేయటం లేదన్నారు. పానుగల్, కేతేపల్లి, మహమ్మదాపురం, రే మద్దుల తదితర గ్రామాల్లో తేమశాతం వచ్చిందని అధికారులేచెబుతున్నారని అక్కడ కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదని ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఇంతవరకు మండలంలో ఒక్క గింజ ధాన్యం కూడా కొనలేదన్నారు. ఇటీవల రెవెన్యూ అదరపు కలెక్టర్ పానిగల్ ఎమ్మార్వో ఆఫీసులు సందర్శించి ధాన్యం వెంటనే కొనాలని ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు స్పందించకపోవడం విడ్డూరమన్నారు. ధాన్యం ఎక్కువగా ఎండితే ధాన్యం తరుగు వస్తుందని ఆందోళన చెందుతున్నారన్నారు. అకాల వర్షాలు పడితే ధాన్యం తడిసి మొలకలు వచ్చి తీవ్రంగా నష్టపోతామని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భయంతో బతుకుతున్నారన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి చేలు నీళ్లలో పడి నష్టపోయారని సిపిఐ పర్యటించి అధికారుల దృష్టికి తెచ్చిన ఇంతవరకు పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే కొనుగోలు చేస్తారన్న భరోసా రైతులకు లేదన్నారు. మీనమేషాలు లెక్కించకుండా కేంద్రాల్లో తేమ శాతం వచ్చిన ధాన్యం ఎప్పటికప్పుడు కొనాలన్నారు. కోతలు మొదలై 20 రోజులు దాటినా తెల్లరాళ్లపల్లి పైతర గ్రామాల్లో కేంద్రాలకు స్థలాలనే కేటాయించలేదని ఇళ్ల వద్దనే ఆరబెట్టుకుంటున్నారన్నారు. ధాన్యం పోసిన కేంద్రాలలో కూడా నీరు నీడ తార్పల్లిండ్లు, ప్రాథమిక చికిత్స కిట్లు ఏర్పాటు చేయలేదన్నారు. ఎండలో రైతులు మలమల మాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తరుగు తీస్తే మిల్లర్లపై చర్య తీసుకుంటామని పాలకులు చెబుతూ వస్తున్నారని ఎవరిపై చర్య తీసుకున్నది లేదన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారుల మాటను మిల్లర్లు పట్టించుకోవటం లేదన్నారు. ఈసారైనా తరుగు తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించారని కానీ జిల్లాలో రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి రూ. 49 కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని వెంటనే చెల్లించాలన్నారు. తమది రైతు ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటున్నారని, ఆచరణలో అది కనిపించటం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించకుంటే సిపిఐ వారి పక్షాన పోరాడుతుందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ కళావతమ్మ, సిపిఐ మండల కార్యదర్శి డంగు కురుమయ్య, మాజీ వార్డు సభ్యుడు పెంటయ్య, గ్రామ శాఖ కార్యదర్శి చిన్న నారాయణ, పరశురాముడు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.(Story : ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించకుంటే ఆందోళన బాట )
