ఆక్రమణలకు గురవుతున్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసిన మున్సిపల్ అధికారులు
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా, వినుకొండ మున్సిపల్ అధికారులు స్థానిక క్రిస్టియన్ పాలెం ప్రాంతంలో సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై కఠిన చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆక్రమణకు గురైన సర్వే నెంబర్ 390/1 సుమారు 1 ఎకరం 13 సెంట్ల విలువైన స్థలాన్ని అధికారులు గురువారం నాడు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలను తొలగించి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ తొలగింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముందు జాగ్రత్తగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వినుకొండ పట్టణ, రూరల్ సీఐలు ప్రభాకర్, బ్రహ్మయ్యల పర్యవేక్షణలో బందోబస్తు జరిగింది. స్వాధీనం చేసుకున్న స్థలాన్ని భవిష్యత్తులో ప్రజా అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.(Story:ఆక్రమణలకు గురవుతున్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసిన మున్సిపల్ అధికారులు)
