అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయడం నేరం
న్యూస్తెలుగు/వనపర్తి : బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయడం నేరమని, వాటిని నివారించే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కొత్తకోట మండల పరిధిలోని పాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యవివాహాలను నిర్మూలించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయడం నేరమని చెప్పారు. బాల్య వివాహాల చట్టం ప్రకారం బాల్యవివాహాలను చేస్తే తల్లిదండ్రుల పైనే కాకుండా వివాహానికి హాజరైన వారు, ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులని తెలియజేశారు. బాల్యవివాహాలకు సంబంధించిన సమాచారం తెలిసి అధికారులకు తెలియజేయకపోవడం కూడా తప్పేనని అన్నారు. గ్రామస్థాయిలో బాల్యవివాహాలను కట్టడి చేయడంలో ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్ల పాత్ర కీలకమని కలెక్టర్ తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు, గాని చిన్నారుల పైన వేధింపులు గాని సమాచారం తెలిస్తే 1098 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సమాచారం తెలియజేయాలని సూచించారు. పాలెం గ్రామంలో గత రెండేళ్లుగా ఒక్క బాల్యవివాహం కేసు కూడా నమోదు కాలేదని ఇది అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారిలో ఉద్యోగులు ఉంటే వారి ఉద్యోగాలను కోల్పోవడం జరుగుతుందని చెప్పారు. అమ్మాయిలను బాగా చదువుకోనిస్తే జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. పాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని గత సంవత్సరం జిల్లాలోని అత్యుత్తమ మార్కులు కనబరిచిందని అలాంటి అమ్మాయిలను ప్రోత్సహిస్తే పదిమందికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. అలాకాకుండా బాల్యవివాహాలు చేస్తే జీవితంలో ఎత్తుకు ఎదగలేరని, అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డిపిఓ తరుణ్ చక్రవర్తి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, డిసిపిఓ రాంబాబు, కొత్తకోట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో వినీత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. (Story:అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయడం నేరం)

