లేబర్ కోడులను రద్దు చేయాలి: మాసన్న
న్యూస్తెలుగు/వనపర్తి : కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం తెచ్చిన లేబర్ కోడులను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాసన్న డిమాండ్ చేశారు. వనపర్తి స్నేహ ఫుట్పాత్ వర్కర్స్ కేంద్రం ఏఐటీయూసీ 106 ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని మాసన్న ఆవిష్కరించి మాట్లాడుతూ.. గతంలో కార్మికులు రోజుకు 16 గంటల నుంచి 18 గంటలు పనిచేసే వారన్నారు. ఏఐటీయూసీ పోరాటం ఫలితంగా పని దినం ఎనిమిది గంటలకు తగ్గించారన్నారు. లేబర్ కోడ్ల అమలులో భాగంగా కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మెహక్కును హరించే కుట్ర చేస్తున్నారని, పని దినం 12 గంటలకు పెంచుతున్నారన్నారు. కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని పోరాడుతున్న చలనం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన అమలు కావటం లేదన్నారు. స్వాతంత్రానికి ముందే ఏర్పడిన ఏకైక కార్మిక సంఘం ఏఐటియుసి అని, కార్మికుల పక్షాన 106 ఏళ్ళగా పోరాడుతూ వస్తుందని ఇంత ఘన చరిత్ర మరే యూనియన్ కు లేదన్నారు. కార్మిక సమస్యలపై ఏఐటీయూసీ పోరాడని అంశం లేదన్నారు. లేబర్ కోడులకు వ్యతిరేకంగా పోరడాల్సిన అవసరం ఉందన్నారు. కనీస వేతనం కోసం ఏఐటీయూసీలో చేరి పోరాడాలి అన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి భాస్కర్, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వినాదం నేతలు ఎర్రకుర్మయ్య చిన్న కుర్మయ్య శాంతన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. (Story:లేబర్ కోడులను రద్దు చేయాలి: మాసన్న)

