దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
న్యూస్తెలుగు/వనపర్తి : మాజీ ఉప ప్రధాని, భారత దేశ హోం శాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, అమర వీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవార ఉదయం వనపర్తి పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానం నుండి ఆర్డీఓ కార్యాలయ చౌరస్తా ద్వారా పాలిటెక్నిక్ మైదానం వరకు సాగిన సమైక్యత దినోత్సవం 2కిలోమీటర్ల పరుగు ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా అటవీ శాఖ అధికారి కె. అరవింద్ ప్రసాద్ రెడ్డి జెండా ఊపి రన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో 562 సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి అనేక సంస్థానాలలో రాజులు స్వయం పాలన కొనసాగిస్తున్నారని, అందులో హైదరాబాద్ సంస్థానం సైతం ఒకటని గుర్తు చేశారు. భారత దేశం 4 ట్రిలియన్ డాలర్ల జి.డి.పి సాధించి అభివృద్ధి పథంలో కొనసాగుతుందని, 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించేందుకు కృషి చేస్తుందన్నారు. యువత భిన్నత్వంలో ఏకత్వం సాధించి దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. యువత ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్న దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం 2కె రన్ విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి కలెక్టర్, ఎస్పీ అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అడిషనల్ ఎస్పీ ఎ .ఆర్.వీరారెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డి.ఎఫ్. ఒ కె. అరవింద్ ప్రసాద్ రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర రావు, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ పి. శ్రీనివాస్ గౌడ్, యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత రన్ లో పాల్గొన్నారు. (Story:దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి)

