యూరియా డీఏపీ పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు
కొరత మాట వినిపించకుండా అధికారులు సర్దుబాట్లు చేయాలి
రాష్ట్ర కోటా నుంచి 3నెలల కోటాను ఇప్పుడే తీసుకురండి
పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారులకు చీఫ్ విప్ జీవీ ఆదేశం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత అన్న మాట వినిపించ కూడదని, యూరియా, డీఏపీ పక్కదారి పట్టించేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్విప్ జీవీ ఆంజనేయులు ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువుల విషయం లో ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేవుడి దయతో ఈసారి వర్షాలు బావుండి, ముందే సీజన్ ప్రారంభమైందని ఆ మేరకు ఏ ఊరికి ఎంత ఎరువులు అవసరమో అంతంత మేర నిల్వలు ఉంచాలని తేల్చిచెప్పారు. ఇదే విషయంపై ఆదివారం జిల్లా, నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. రైతు ఎన్ని ఎకరాలు పంటవేస్తే అన్ని ఎకరాలకు యూరియా, డీఏపీ అందించేలా అధికారులు సన్నద్ధం కావాలన్నారు. గ్రామాల పరిమాణం. ఆర్బీకేల్లోని వివరాలు బట్టి నిల్వలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పంటలు వేసిన వారికి, దుక్కి వేసుకుందామని చూస్తున్న వారిలో ఎవరికీ ఎరువుల కొరత రానివ్వొద్దని సూచిం చారు. అవసరమైతే రాష్ట్ర కోటా నుంచి వచ్చే 3నెలల నిల్వలు ఇప్పుడే తీసుకుని గ్రామాలకు తరలించాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు అన్ని గ్రామాలతో పాటు సొసైటీల్లోనూ కావాల్సిన ఎరువుల నిల్వలు ఏర్పాటు చేశాం. ఏదైనా గ్రామాల్లో ఇబ్బంది ఉంటే దగ్గర్లోని సొసైటీల్లో తీసుకోవచ్చన్నారు. రైతుల అవసరాలు గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ఆ గ్రామాలకు లోడ్లు పంపిస్తున్నామన్నారు. అధికారులంతా సమన్వయం తో పనిచేస్తున్నామన్నారు. డీఏపీ పరంగా ఎక్కడా సమస్య లేదని, యూరియా విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ వ్యవసాయ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ రవికుమార్, వినుకొండ వ్యవసాయ అధికారి వరలక్ష్మి, బొల్లాపల్లి వ్యవసాయ అధికారి అబ్బూరి అంకారావు, ఈపూరు వ్యవసాయ అధికారి రామారావు, నూజెండ్ల వ్యవసాయ అధికారి ఆంజనేయ నాయక్ పాల్గొన్నారు.(Story : యూరియా, డీఏపీ పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు )

