విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్యను అందించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యను అందించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ ఆదేశించారు.శనివారం వనపర్తి మండలం, పెద్దగూడెంలోని మహాత్మా జ్యోతిబాపూలే వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను అదనపు కలెక్టర్ రెవెన్యూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, ప్రిన్సిపాల్ మరియు సిబ్బందితో మాట్లాడారు.విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వంట గది, నిల్వ గది పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. వంట గదిని, నిల్వ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వంట చేసేవారు వంటకు ముందు చేతులను శుభ్రంగా కడుక్కొని వంటలు ప్రారంభించాలన్నారు. వంట సిబ్బందికి వైడల్ పరీక్షలు చేయించారా లేదా అని విచారించారు. కూరగాయలు, వంట నూనె నాణ్యత, బియ్యం సన్న రకమా కాదా అని స్వయంగా పరిశీలించారు. తాగునీటి సౌకర్యాలను తనిఖీ చేశారు. అనంతరం, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. డి.సి.ఓ శ్రీవేణి, తహసీల్దార్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రశాంతి, ఫుడ్ సూపర్వైజర్ స్టెల్లా తదితరులు అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు.(Story : విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్యను అందించాలి)

