ఘనంగా పైడిమాంబ పందిరిరాట మహోత్సవం
న్యూస్తెలుగు/విజయనగరం : ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి పందిరిరాట మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ముందుగా అమ్మవారి చదురగుడి వద్ద ముహూర్త సమయానికి పందిరిరాట వేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని వనంగుడి వద్ద కూడా ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. దీంతో అమ్మవారి సినిమాను సంబరాలకు శ్రీకారం చుట్టినట్టయింది. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కే.శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఆలయ పూజారులు, అధికారులు కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రూ.1.8 కోట్లతో అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే అదితి గజపతి
పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులను ఈ పండుగ అయిపోయిన వెంటనే ప్రారంభించి, వచ్చే ఏడాది పండుగ నాటికి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సుమారు రూ.కోటి 80 లక్షలతో ఈ అభివృద్ధి పనులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పనులకు టెండర్లను పిలవడం జరిగిందని, చండీయోగం ముగిసిన వెంటనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. అమ్మవారి పండుగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు సూచనల మేరకు ఈ ఏడాది కూడా భక్తులకు పైడితల్లి అమ్మవారి ఉచిత దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.(Story:ఘనంగా పైడిమాంబ పందిరిరాట మహోత్సవం )
