దొండపాడు మట్టి తవ్వకాలపై చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సీరియస్
సమగ్ర నివేదిక కోరడంతో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం దొండపాడు గ్రామ పరిధిలో మట్టి తవ్వకాలకు సంబంధించి వచ్చిన సమాచారం పై చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రంగా పరిగణించినట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. మీడియాలో వచ్చిన కథనాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక కోరడంతో స్థానిక అధికారులు కూడా హుటాహుటీన కదిలారు. ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది మట్టి తవ్వకాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులనూ అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి నుంచి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు ఉంటాయని, ఎవరైనా ఉపేక్షించించేది లేదని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నట్లు వారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఎక్కడా ఎవరికి ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని, ఒకవేళ ఎవరైనా తమ పేరో, ప్రభుత్వం పేరో చెబితే మాత్రం ఊరుకునేది లేదని ఆయన తెలిపినట్లు లేఖలో పేర్కొన్నారు. మట్టి, ఇసుక తవ్వకాలు సహా వేరే ఏ పనిలో అయినా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరైనా ప్రవర్తించినా, తప్పుగా పేర్లు వాడుకున్నా తీవ్రంగా పరిగణిస్తామన్నారు. అంతేకాక ఇక పై నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తామని, స్థానిక నాయకత్వం, శ్రేణులు కూడా అప్రమత్తంగా ఉండి, ఇలాంటి ఘటనలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు.(Story : దొండపాడు మట్టి తవ్వకాలపై చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సీరియస్ )

