ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలి
న్యూస్ తెలుగు /వినుకొండ : రైతులు అధిక ఆదాయం సాధించడమే లక్ష్యంగా ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఉద్యాన పంట సాగుపై రైతుల్లో అవగాహన పెంపొందించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కోరారు. వినకొండ లో జరగనున్న కిసాన్ మేళా ఏర్పాటు పై మంగళవారం హార్టికల్చర్, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక సంపదను సృష్టించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఐటీ రంగంతో లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం వలన రాష్ట్ర అభివృద్ధితో పాటు ఆర్థిక ప్రగతి సాధించగలిగామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యానవన పంట సాగును ప్రోత్సహిస్తున్నారని ఆ దిశగా రైతుల్లో అవగాహన పెంపొందించి ఉద్యాన పంట సాగును పెంచాలని సూచించారు. ఉద్యాన పంటల ద్వారా తక్కువ పెట్టుబడితో రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. రైతు తలసరి ఆదాయం పెంచేందుకు ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల తలసరి ఆదాయం పెరగటం వలన సంపద సృష్టించబడి రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల రైతులకు ప్రభుత్వం సాయం చేస్తుందని, ఉద్యాన శాఖ ద్వారా పండ్లు పూలు తదితర ఉద్యాన పంట సాగుకు రాయితీ అనిపిస్తుందని తెలిపారు. ఉద్యాన పంట సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీ వివరాలను ప్రతి రైతుకు తెలియజేసి ఉద్యాన పంట సాగుకు ప్రోత్సహించి రైతు ఆర్థిక ప్రగతి సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటలను సాగు చేసేందుకు రైతును ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, ఉపాధి హామీ, మైక్రో ఇరిగేషన్, ప్రకృతి వ్యవసాయం మరియు సెరి కల్చర్ అధికారులు పాల్గొన్నారు. (Story:ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలి)
