పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
న్యూస్తెలుగు/ వనపర్తి : వనపర్తి జిల్లాలో జులై 27న జరిగే గ్రామ పరిపాలన అధికారులు, సర్వేయర్ల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు. పరీక్షల నిర్వహణ పై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.వనపర్తి జిల్లా నుండి 49 మంది వి.ఆర్. ఒ లు, వి.ఆర్. ఎ లు, 112 మంది సర్వేయర్ లు జులై 27న జరిగే పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వనపర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేశారు. వి.ఆర్. ఒ లు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు నిర్వహిస్తారు. అదే సర్వేయర్లకు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు తిరిగి 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నిరంతర విద్యుత్ సదుపాయం ఉండాలని ఆదేశించారు.
పరీక్షలు రాసే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకురావడానికి వీలులేదని సూచించారు. అభ్యర్థులు ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు పరీక్షా కేంద్రంలో అనుమతించడం జరుగుతుందని 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతి లేదని తెలియజేశారు.
టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే పోటీ పరీక్షలకు ఏ విధమైన నియమ నిబంధనలు ఉంటాయో అవే నిబంధన ప్రకారం వీఆర్వో, సర్వేయర్ లకు రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.
పోలీస్ శాఖ ద్వారా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డిఎస్పి వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య అధికారి డా. శ్రీనివాసులు, ఎ.డి. సర్వే బాలకృష్ణ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జలుద్దీన్, స్థానిక తహసిల్దార్ రమేష్ రెడ్డి, డి. సెక్షన్ సూపరిండెంట్ మదన్ మోహన్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు. (Story:పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి)

