రాయితీ రుణాలకు కూడా సిబిల్ స్కోర్ ఎంతో కీలకం
నైపుణ్యాలు పెంచుకుంటునే పోటీ ప్రపంచంలో మనుగడ: జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ :పేదల నుంచి వృత్తి నిపుణుల వరకు ప్రభుత్వం అందించే రాయితీ రుణాలకు కూడా సిబిల్ స్కోర్ కీలకంగా మారిన విషయాన్ని ప్రతిఒక్కరు గమనించాలని ప్రభుత్వ చీఫ్విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించారు. లేదంటే పథకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావని తెలిపారు. ఇటీవల కాలంలో మారిన ఈ నిబంధనల గురించి ప్రతిఒక్కరు తెలుసుకుని, క్రెడిట్ స్కోరును కాపాడుకోవాలని అన్నారు. అలానే నైపుణ్యాలు పెంచుకుంటునే పోటీ ప్రపంచంలో మనుడనే విషయం కూడా గమ నంలో పెట్టుకోవాలన్నారు. నైపుణ్యం వారికే వ్యాపారం, అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.
వినుకొండ పట్టణం వీఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఫొటోగ్రాఫర్ల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన ఆయన యూనియన్ భవనం కోసం స్థలం అడిగారని, త్వరలో నెరవేరుస్తామన్నారు. భవన నిర్మాణానికి వ్యక్తిగతంగా తన తరఫున రూ.లక్ష విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలని, పీఎంఈజీపీ వంటి స్కీమ్లో 30శాతం వరకు సబ్సిడీ రుణాలు లభిస్తు న్నాయన్నారు. రూ.5 లక్షల నుంచి రూ.20లక్షల వరకు సబ్సిడీ వచ్చే రుణాలు కూడా ఉన్నా యని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీమా చేసుకోవడం అవసరం అని గుర్తించాల ని. వీరి కోసం శివశక్తి ఫౌండేషన్ తరఫున గతంలో రూ.5లక్షల ప్రమాద బీమా చేయించిన విషయం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. (Story:రాయితీ రుణాలకు కూడా సిబిల్ స్కోర్ ఎంతో కీలకం)
