గిరిజన గ్రామాల్లో అభివృద్ధి చేపడతాం

న్యూస్తెలుగు/ సాలూరు :గిరిజనులు నివసించే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సదుపాయాలు జీవనోపాధి కనెక్టివిటీ, ఆర్థిక సాధికారిత వంటి కీలక రంగాల్లో అభివృద్ధి చర్యలు చేపడతాయని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం సాలూరు మండలం కొత్తవలస గ్రామం, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల,
లో నిర్వహించిన “ధర్తి ఆబ జన్ – జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (DA-JGUA)” అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా 2024 అక్టోబర్ 2న ప్రారంభించిన DA-JGUA పథకం, దేశంలోని గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి గాను
రూపొందించబడిందని పేర్కొన్నారు. ఈ పథకం 2024-25 నుండి 2028-29 వరకు ఐదు సంవత్సరాలపాటు అమలులో ఉంటుందని వివరించారు.ఈ పథకం క్రింద గిరిజనులు నివసించే 63,843 గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యసేవలు, జీవనోపాధులు, కనెక్టివిటీ, ఆర్థిక సాధికారత వంటి కీలక రంగాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టబడతాయని మంత్రివర్యులు తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా – 165 ఎంపిక చేసిన గ్రామాలు
మొదటి దశలో పార్వతీపురం మన్యం జిల్లాలో 165 గిరిజన గ్రామాలను ఎంపిక చేసి, వీటిలో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించబడినట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులను saturation స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలియజేశారు.
ప్రధాన అభివృద్ధి రంగాలు:
గృహ మౌలిక సదుపాయాలు (ఇళ్ల నిర్మాణం, రహదారులు, నీటి సదుపాయాలు, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు)ఆరోగ్యం & పోషణ (మెడికల్ యూనిట్లు, ఆయుష్మాన్ భారత్, అంగన్వాడీలు, పోషణ వనాలు)విద్యా రంగం (హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, స్కిల్ ట్రైనింగ్ కేంద్రాలు)విద్యుద్దీకరణ (ఇంటింటికి విద్యుత్, సోలార్ విద్యుత్)ఆర్థిక సాధికారత (వ్యవసాయ, పశుసంవర్ధక రంగ అభివృద్ధి, వృత్తి నైపుణ్య పథకాలు)కనెక్టివిటీ (4G నెట్వర్క్, డిజిటల్ సెంటర్లు)
జూన్ 15 నుండి 30 వరకు అవగాహన & ప్రయోజన సదస్సులు
ఈ పథకం అమలులో భాగంగా జూన్ 15 నుండి 30, 2025 వరకు జిల్లాలోని గ్రామాలలో ప్రత్యేకంగా అవగాహన మరియు ప్రయోజన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గిరిజనుల స్థితిగతులపై సర్వేలు నిర్వహించి 14 ప్రధాన ప్రభుత్వ సేవలు/లబ్ధులు గిరిజనులకు అందించబడతాయని పేర్కొన్నారు.అవి
1. ఆధార్ కార్డులు
2. రేషన్ కార్డులు
3. ఆయుష్మాన్ భారత్ కార్డులు
4. కుల & నివాస ధృవీకరణ పత్రాలు
5. కిసాన్ క్రెడిట్ కార్డులు
6. పిఎం కిసాన్ పథకం
7. జన్ ధన్ ఖాతాలు
8. గ్యాస్ కనెక్షన్లు
9. బీమా పథకాలు
10. వృద్ధాప్య/వితంతు/దివ్యాంగుల పెన్షన్లు
11. ఉపాధి పథకాలు (MGNREGS, ముద్ర లోన్, విశ్వకర్మ)
12. మాతృత్వ వందన యోజన
13. ఇమ్యూనైజేషన్
14. ICDS పథకాలు
“మన ప్రాంత గిరిజనులు ఈ అవగాహన సదస్సుల్లో పాల్గొని ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి. ఇది మన గ్రామాల భవిష్యత్తుకు దిక్సూచి అవుతుంది. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పార్వతి గ్రామ సర్పంచ్ నెమలిపిట్ట ధర్మవతి, ఎంపీటీసీ కోట దాలమ్మ, మాజీ సర్పంచ్ అముజురు రూపావతి టీడీపీ మండల అధ్యక్షుడు పరమేశు, శ్రీను వెంకటస్వామి, లక్షణ తదితరులు పాల్గొన్నారు (Story:గిరిజన గ్రామాల్లో అభివృద్ధి చేపడతాం)