చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్రకు ఏర్పాట్లు
యోగాంధ్రపై విశాఖ వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం
చీఫ్ విప్ జీవీ, మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా, అనగాని, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి హాజరు
న్యూస్ తెలుగు – వినుకొండ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025 చరిత్రలో నిలిచి పోయేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు చీఫ్విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ప్రజాప్రతినిధులు, పోలీసు సహా స్థానిక యంత్రాంగం, రాష్ట్రస్థాయి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర -2025 కార్యక్రమంపై మంగళవారం విశాఖ వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగానే ఈ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గం పరిశీలకుడిగా కూడా ఉన్న చీఫ్విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ యోగాంధ్ర-2025 కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే అవకాశంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని విభాగాల సమన్వయంతో, ముఖ్యంగా స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని సూచించారు. మరీ ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌలభ్యం కోసం అధికారులు, పోలీసు శాఖ కలిసి సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఈ అంశాలన్నిటి పై సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంలో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా ముదుకు సాగాలని నిర్ణయించారు. ప్రజలందరి భాగస్వామ్యంతో యోగాంధ్రకు మరింతగా ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. (Story:చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్రకు ఏర్పాట్లు)

