డిఎ జుగా కార్యక్రమానికి అనూహ్య స్పందన
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
న్యూస్ తెలుగు /సాలూరు : ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డిఎ జెజియుఎ) కార్యక్రమం జిల్లాలో బాగా జరుగుతుందని, గిరిజన ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం సాలూరు మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 30 వరకు డిఎ జుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతిని కలెక్టర్ ఈ సందర్బంగా గుర్తుచేశారు. అందులో భాగంగా గిరిజనుల అవసరాలను గుర్తించి ధ్రువపత్రాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసే ఈ కార్యక్రమంలో గిరిజన ప్రాంతాల్లో సేవలు, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయమని అన్నారు. గ్రామ/ క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా వివిధ సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో అందించేలా జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం,కిసాన్ క్రెడిట్ కార్డ్, పియం కిసాన్ కార్డులు, జన్ ధన్ ఖాతా, పిఎం జెజెబివై, పిఎం ఎస్ బివై బీమా కవరేజ్, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సామాజిక భద్రత పింఛన్లు, ఉపాధి హామీ, పియం విశ్వకర్మ, ముద్ర తదితర జీవనోపాధి పథకాలు, పిఎం యంవివై, ఇమ్యునైజేషన్ తదితర స్త్రీ శిశు సంక్షేమ ప్రయోజనాలను ప్రజలు వినియోగించు కుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. పివిటిజి గృహాలు, గిరిజన గ్రామాలను గుర్తించడం, గ్రామ/ క్లస్టర్ స్థాయి శిబిరాలను నిర్వహించడం, ఆరోగ్యం, ఆహారం, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయం, రెవెన్యూ ఇతర విభాగాల సమన్వయంతో కార్యకలాపాలు చేపట్టాలని అన్నారు. ఆధార్, ఇ – కెవైసి డాక్యుమెంటేషన్ సంబంధిత సేవల కోసం సంబంధిత విభాగాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఆధార్ లో నమోదు కాని వారిని అంగన్వాడీ సిబ్బంది నమోదు చేయించాలని, గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story:డిఎ జుగా కార్యక్రమానికి అనూహ్య స్పందన)