రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు
న్యూస్ తెలుగు/వనపర్తి : రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో తొలిసారి అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి నాణ్యమైన వడ్లు సేకరించడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్ తెలియజేశారు. మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సెక్రెటరీ డి.ఎస్ చౌహన్ వనపర్తి జిల్లాలో పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లుతో కలిసి పానగల్ మండలంలోని వెంగళాయ పల్లి, తెల్లరాళ్ళ పల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మీడియా తో మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం ఒకసారి కొనుగోలు కేంద్రానికి చేరుకున్న తర్వాత పూర్తి బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే అన్నారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి నాణ్యమైన వడ్లు సేకరించేందుకు వ్యాక్యూం పాడి క్లీనర్లు కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయడం జరిగిందన్నారు. యంత్రాల ద్వారా చెత్త, తాలు, మట్టిని వేరు చేసి నాణ్యమైన వడ్లు వస్తుందని, తేమ శాతం సైతం తగ్గిస్తుందన్నారు. రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం రైతులకు అండగా ఉండి మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. నాణ్యమైన వడ్లు మిల్లులకు ఇస్తే ఒక్క గ్రాము తరుగు చేస్తే తనకు ఫిర్యాదు చేయాలని రైతులకు భరోసా కల్పించారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం. సివిల్ సప్లై జగన్మోహన్ తదితరులు ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంట ఉన్నారు.(Story : రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు )
