తెలంగాణ రాష్ట్ర లక్ష్యాల సాధనకు మళ్ళీ పోరాడాలి
న్యూస్ తెలుగు/ వనపర్తి : నీళ్లు, నిధులు, నియామకాలు, విభజన హామీల సాధనకు మళ్ళీ పోరాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు పిలుపునిచ్చారు.సోమవారం వనపర్తి సిపిఐ జిల్లా ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కార్యదర్శి విజయరాములు జాతీయ పతాకాన్ని ఎగరవేసి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి విడతలో 369 మంది, మలి విడతలో 1200 మంది ఆత్మ బలిదానం చేశారన్నారు. తెలంగాణ ప్రజల నీళ్లు, నిధులు, నియామకాలను నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ వాటిని నెరవేర్చక పోగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను దోపిడీ చేశారన్నారు. టిఆర్ఎస్ను గద్దించి ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా నీళ్లు నిధులు నియామకాలు విభజన హామీలను సాధించే దిశగా పాలన సాగటం లేదన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే మార్గమని జాతీయస్థాయిలోను ఉమ్మడి రాష్ట్రంలోనూ ఒకే మాటపై నిలబడి పోరాడిన ఏకైక పార్టీ సిపిఐ మాత్రమే అన్నారు. ప్రజల ఆకాంక్ష కోసం పోరాడి చరిత్రలో నిలిచిందన్నారు. మిగతా రాజకీయ పార్టీలు తెలంగాణలో ఆంధ్రలో దేశంలో భిన్న వైఖరులను తీసుకున్నాయ న్నారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు కావస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. పాలమూరు జిల్లా వరప్రదాయినిగా భావిస్తున్న పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. బిజెపి ప్రభుత్వం భజన హామీలను నెరవేర్చటంలో ఫలమైందన్నారు. తల్లిని చంపి పిల్లని బతికించారని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో తెలంగాణ పై నీచమైన వ్యాఖ్యలు చేశారన్నారు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బిజెపిఅనేక అబద్దాలు చెబుతోందని, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన సిపిఐ ఇప్పుడు మళ్ళీ వాటిన సాధించేందుకు మరోసారి పోరాల్సిన అవసరం ఉందని కార్యకర్తల సిద్ధం కావాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రకుర్మయ్య, భారతీయ మహిళా సమాఖ్య పట్టణ అధ్యక్షులు జయమ్మ, నేతలుశిరీష, జ్యోతి, సాద్విని తదితరులు పాల్గొన్నారు.(Story : తెలంగాణ రాష్ట్ర లక్ష్యాల సాధనకు మళ్ళీ పోరాడాలి )
