వాగ్దానాలను నెరవేర్చని కూటమి ప్రభుత్వం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాటి నుండి వినుకొండ లో చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై వైయస్ఆర్సీపీ పార్టీ, పి. ఏ. సి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైయస్ఆర్సీపీ పార్టీ పి. ఏ. సి మెంబర్ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైయస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళు తెరిపిస్తామని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతోంది. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దానిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు. అధికారంలో వచ్చిన తొలిరోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ, ఏడాదిలోనే తొంబై తొమ్మిదిశాతం అమలు చేసిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ది అలాగే విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి, ఆచరణలోకి తీసుకువచ్చి, ప్రజల వద్దకే సుపరిపాలనను తీసుకువెళ్ళి అందించి చరిత్ర సృష్టించారు. దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవిచూపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో కూడా చంద్రబాబు నిరూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆనాడే వైయస్ జగన్ స్పందిస్తూ, వాటిని అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, ప్రజలను మోసం చేయడానికే ఇటువంటి హామీలు ఇస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పీ-4 అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. పేదరికంను నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మోసం బహుశా ఎక్కడా మనకు కనిపించదు. గతంలో హామీలను అమలు చేస్తానంటూ అబద్దాలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బరితెగించి, హామీలను అమలు చేయడం కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నాడు. జూన్ 04 న వినుకొండ లో ఉదయం 10:00 గం:లకు వెన్నుపోటు దినం ర్యాలీ చంద్రబాబు సీఎంగా తొలి ఏడాదిలోనే రూ.1.49 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ సొమ్ము దేనికి వినియోగించారో తెలియదు. ఆనాడు మామాకు వెన్నుపోటు పొడిస్తే, ఈ రోజు నేరుగా తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారు. దీనిని ప్రశ్నిస్తూ వైయస్ఆర్సీపీ వెన్నుపోటుదినంను నిర్వహిస్తోంది. వినుకొండ నియోజకవర్గం లో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్ళి స్థానికంగా ఉన్న మండల కార్యాలయంలో మెమో సమర్పిస్తాము. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని దానిని తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు మోసపోయిన ప్రజలు కూడా పాల్గొని, ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిస్తున్నామని వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.(Story : వాగ్దానాలను నెరవేర్చని కూటమి ప్రభుత్వం )
