జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ జి. వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం ఆయన పెబ్బేరు మార్కెట్ యార్డు, షేర్ పల్లి, పెద్ద దగడ బెక్కం, వెలుగొండ, వీపనగండ్ల, కలవరాలా, బుసిరెడ్డిపల్లి గోడౌన్, కేతపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని కేంద్రాల ఇన్చార్జులను ఆదేశించారు. ధాన్యాన్ని వెంటనే తరలించడానికి అవసరమైన లారీలను మరిన్నింటిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. హమాలీలను పెంచాలని, అలాగే ఎక్కువ ట్రాక్టర్లను ఉపయోగించి ధాన్యాన్ని దగ్గరలోని గోడౌన్లు, రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు.అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని తడవకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు శుభ్రమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తద్వారా కొనుగోలు ప్రక్రియ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.(Story : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి )

